యాక్షన్, రియాక్షన్‌.. సోషల్ మీడియా ఓవరాక్షన్‌! | Sakshi
Sakshi News home page

యాక్షన్, రియాక్షన్‌.. సోషల్ మీడియా ఓవరాక్షన్‌!

Published Wed, Apr 20 2016 7:14 PM

యాక్షన్, రియాక్షన్‌.. సోషల్ మీడియా ఓవరాక్షన్‌! - Sakshi

'చర్యకు సరిసమానమైన ప్రతి చర్య ఉంటుంది. అదే సోషల్‌ మీడియాలో అయితే.. అది మితిమీరి అతిగా ఉంటుంది'.. బుధవారం ఉదయం ట్విట్టర్‌లో ఆలియా భట్‌ చేసిన ట్వీట్‌ ఇది. తన విమర్శలకు గట్టి సమాధానం చెప్పేందుకు చేసిందో లేక సహజంగానే తనకు నచ్చడం వల్ల ఈ కామెంట్‌ ను షేర్‌ చేసిందో తెలియదు కానీ.. ఈ ట్వీట్‌ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తాజా సినిమా 'ఉడ్తా పంజాబ్‌'లో తన పాత్రపై వస్తున్న విమర్శలకు సమాధానం ఈ ట్వీట్‌ కావొచ్చునని వినిపిస్తోంది.

అభిషేక్‌ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉడ్తా పంజాబ్‌' సినిమాలో బిహారీ వలస మహిళ పాత్రలో ఆలియ కనిపిస్తున్నది. పంజాబ్‌లో తాండవిస్తున్న డ్రగ్స్‌ మహామ్మారి ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో ఆలియా కనిపించిన తీరుపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుండగా.. ఆలియా పాత్రను తీవ్రంగా విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో ఓ బహిరంగ లేఖ హల్‌చల్‌ చేస్తోంది.

మొదట ఓ వెబ్‌సైట్‌లో ఈ లేఖ కనిపించింది. ఈ లేఖ రాసిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తనకు తాను 'బిహారీ అమ్మాయి'గా చెప్పుకుంటూ ఆలియా పాత్రపై చండ్ర నిప్పులు కురిపించింది. బిహారీలు అనగానే దుర్భర దారిద్ర్యంలో ఉంటారని, పేదరికానికి, నేరాలకు ప్రతిబింబంగా బిహార్‌ ఉంటుందనే పాతచింతకాయ ఆలోచనల్నే ఈ చిత్రంలో ఆలియా పాత్ర ప్రతిబింబిస్తున్నదని ఆమె ధ్వజమెత్తింది. ఈ లేఖకు కౌంటర్‌గానే ఆలియా ఈ ట్వీట్‌ చేసిందా? అనే అభిప్రాయం బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు సినీ జనాలు మాత్రం 'ఉడ్తా పంజాబ్‌'లో ఆలియ నటన సూపర్‌ అంటూ ట్విట్టర్‌లో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆలియా భట్‌, షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement