నేను ఆపిన చోటే కరీనా మొదలుపెట్టింది: కరిష్మా కపూర్ | Sakshi
Sakshi News home page

నేను ఆపిన చోటే కరీనా మొదలుపెట్టింది: కరిష్మా కపూర్

Published Fri, Sep 27 2013 12:01 PM

నేను ఆపిన చోటే కరీనా మొదలుపెట్టింది: కరిష్మా కపూర్ - Sakshi

బాలీవుడ్ నుంచి తాను ఖాళీ చేసిన స్థానాన్ని తన చెల్లెలు కరీనా కపూర్ భర్తీ చేసిందని అలనాటి హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది. తమ బంధువు రణ్బీర్ కపూర్తో కలిసి తమ కుటుంబ నట వారసత్వాన్ని నిలబెడుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. సినిమాల నుంచి తప్పుకోవడం తాను చేసిన అతి పెద్ద తప్పని, అయితే తన పొరపాటును కరీనా సరిదిద్దిందని ఆనందం వ్యక్తం చేసింది.

ఇప్పుడు రణ్బీర్ కూడా చాలా బాగా చేస్తున్నాడని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. 2003 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తర్వాత కరిష్మా కపూర్ వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన సంజయ్ కపూర్ అనే పారిశ్రామిక వేత్తను ఆమె పెళ్లాడింది. కానీ, ఈ సంవత్సరం విడాకులు తీసేసుకుంది. ఒకప్పుడు రాజా హిందూస్థానీ, బీవీ నెంబర్ వన్ లాంటి సినిమాలతో అగ్రస్థాయికి వెళ్లిన ఆమె, ఇప్పుడు తన పిల్లలు సమైరా (8), కియాన్ (3)లను పెంచడంతో కాలం గడిపేస్తోంది. గత సంవత్సరం 'డేంజరస్ ఇష్క్' అనే సినిమా చేసినా, అది అంతంతమాత్రంగానే ఆడింది.

తన తొలి ప్రాధాన్యం పిల్లలేనని, వాళ్లే తన ప్రపంచమని కరిష్మా తెలిపింది. పిల్లలు తనను సాధారణ తల్లిగానే చూస్తారు తప్ప తన స్టార్డమ్ విషయం పట్టించుకోరని తెలిపింది. తాను వేసుకున్న దుస్తులు వాళ్లకు నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పేస్తారని అంది. తాను ఇంట్లో చాలా క్రమశిక్షణతో ఉంటూ, పిల్లలను కూడా అలాగే పెంచుతానని వివరించింది. అలాగని వాళ్లను కట్టుబాట్లతో పెంచేది మాత్రం లేదని, పిల్లలతో స్నేహంగానే ఉంటానని తెలిపింది. తన మీద తల్లిదండ్రులిద్దరి ప్రభావం ఉందని వివరించింది.

Advertisement
Advertisement