రాజకీయ నేపథ్య చిత్రంలో అరుళ్‌నిధి | Sakshi
Sakshi News home page

రాజకీయ నేపథ్య చిత్రంలో అరుళ్‌నిధి

Published Thu, Aug 17 2017 12:55 AM

రాజకీయ నేపథ్య చిత్రంలో అరుళ్‌నిధి - Sakshi

తమిళసినిమా: రాజకీయ నేపథ్యంలో కథా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి. రాజకీయ సెటైర్‌లతో కూడిన ఈ తరహా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతకు, తెరపై ఆవిష్కరించడానికి దర్శకుడికీ, నటించడానికి తారలకు గట్స్‌ కావాలి. ఇక నటుడు అరుళ్‌నిధి నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. రాజకీయ దురంధరుడు, డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబం నుంచి వచ్చిన యువ నటుడాయన. అదే విధంగా దర్శకుడు కరు.పళనీయప్పన్‌ చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయి. ఆయన చిత్రాల్లో రాజకీయాలతో పాటు సామాజిక స్పృహ స్పష్టంగా కనిపిస్తుంది.

అలాంటి దర్శకుడు కరు.పళనీయప్పన్, నటుడు అరుళ్‌నిధిల కాంబినేషన్‌లో రాజకీయ నేపథ్యంలో చిత్రం తెరక్కెనుంది. ఈ సంచలన చిత్రాన్ని యాక్సెస్‌ ఫిలిం ఫాక్టరీ అధినేత ఢిల్లీబాబు నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నిర్మించిన మరగదనాణియం చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అరుళ్‌నిధి హీరోగా ఇరవుక్కు ఆయిరం కన్‌గళ్, విష్ణువిశాల్‌ హీరోగా రాక్షసన్‌ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటితో పాటు మళ్లీ అరుళ్‌నిధి కథానాయకుడిగా కరు.పళనీయప్పన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు.

Advertisement
Advertisement