రజనీ చిత్ర టైటిల్‌లో జీవీ | Sakshi
Sakshi News home page

రజనీ చిత్ర టైటిల్‌లో జీవీ

Published Sun, Aug 27 2017 2:58 AM

రజనీ చిత్ర టైటిల్‌లో జీవీ

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ టైటిల్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌. రజనీకాంత్‌ గతంలో నటించిన చిత్రాల టైటిల్‌కు ఇటీవల పిచ్చ క్రేజ్‌ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ తరం నటులు ఆయన చిత్రాల టైటిల్‌లో నటించాలని ఆశపడుతున్నారు. నటుడు ధనుష్, ఉదయనిధి స్టాలిన్‌ లాంటి వారు ఇప్పటికే రజనీకాంత్‌ చిత్ర టైటిల్స్‌ను తమ చిత్రాలకు పెట్టుకుని సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ రజనీకాంత్‌ చిత్ర టైటిల్‌తో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

రజనీకాంత్‌ చాలా కాలం క్రితం నటించిన సూపర్‌హిట్‌ చిత్రం కుప్పత్తురాజా. ఇప్పుడు అదే టైటిల్‌తో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ నటించిన చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఎస్‌.ఫోకస్‌ పతాకంపై ఎం.శరవణన్, ఎస్‌.సీరజ్, టి.శరవణన్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి పదుర్‌.రమేశ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు బాబా భాస్కర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి జీవీనే సంగీతాన్ని అందిస్తున్నారు. కుప్పత్తురాజా చిత్రం గురించి నిర్మాతలు తెలుపుతూ పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్స్‌గా వ్యవహరించిన అనుభవంతో చిత్ర నిర్మాణం చేపట్టి నిర్మిస్తున్న చిత్రం కుప్పత్తురాజా అని తెలిపారు.

కథానాయకుడిగా ఎదుగుతున్న జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ఈ చిత్రంతో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుంటారని అన్నారు. నృత్య దర్శకుడు బాబా భాస్క ర్‌ చెప్పిన కథ తమకు బాగా నచ్చేసిందని చెప్పారు. ఆయనలో మంచి దర్శకుడు ఉన్నారని, ప్రతి సన్నివేశాన్ని చాలా పరిణితి చెందిన దర్శకుడిగా తెరెకెక్కించారని తెలిపారు. కుప్పత్తురాజా టైటిల్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రటైటిల్‌ అనే కాకుండా తమ చిత్ర కథకు నప్పే టైటిల్‌ అని పేర్కొన్నారు. ఇందులో నటి పూనంబాజ్వా, పల్లక్‌ లాల్‌రాణి కథానాయికలుగా నటించగా, పార్థిబన్, ఎంఎస్‌.భాస్కర్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారని, చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. చిత్రాన్ని క్రిస్మస్‌ పండగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement