రజనీ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన.. | Sakshi
Sakshi News home page

రజనీ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన..

Published Mon, Feb 16 2015 1:29 PM

రజనీ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన..

చెన్నై: భారీ అంచనాలతో విడుదలైన రజనీకాంత్ 'లింగ' సినిమా ఊహించని రీతిలో నష్టాలను మూటకట్టుకుంది. దీంతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన బాటపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నిరాహారదీక్ష చేపట్టారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ పదిశాతం పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంలో నష్టాన్ని అంచనా వేసేందుకు హీరో రజనీకాంత్.. తన స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన తిరుపూర్ సుబ్రహ్మణ్యాన్ని నియమించారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.35 కోట్లను చెల్లించాలని నిర్ణయం జరిగింది.

అయితే ఇపుడు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు నిర్మాత వెంకటేష్ నిరాకరిస్తున్నాడని డిస్ట్రిబ్యూటర్ సింగర్ వడివేలన్ ఆరోపిస్తున్నారు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు,  థియేటర్ యజమానులు అందరూ కలిసి హీరో రజనీకాంత్ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నామని తెలిపారు. తమను ఈ స్థితికి నెట్టింది నిర్మాతలేనని ఇంతకు మించి తమకు వేరే గత్యంతరం లేదని పంపిణీదారులు, థియేటర్ యజమానులు వాపోతున్నారు.

మరోవైపు ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'లింగ' సినిమా వందకోట్లకు అమ్ముడు బోయిందని, తమకు డబ్బులు చెల్లించడంలో ప్రొడ్యూసర్ వెంకటేష్కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడంలేదంటూ వడివేలన్ విమర్శించారు. తాము అడుగుతున్న నష్టపరిహారం రజనీకాంత్కు చెల్లించిన దానికంటే చాలా తక్కువే ఉంటుందంటున్నారు.  ఇప్పటికైనా తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ ఇంటిముందు నుంచి అడుక్కుంటూ సాగే తమ ఆందోళన మంగళవారం మొదలు పెట్టబోతున్నట్టుగా తెలిపారు.

Advertisement
Advertisement