లెక్క తర్వాత తేలుస్తారు! | Sakshi
Sakshi News home page

లెక్క తర్వాత తేలుస్తారు!

Published Fri, Sep 9 2016 11:20 PM

లెక్క తర్వాత తేలుస్తారు!

మహేశ్‌బాబు అభిమానులకు, ప్రేక్షకులకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అందరికీ కొత్త మహేశ్‌ను చూపిస్తానంటున్నారు. మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. గతంలోనే మహేశ్-మురుగదాస్ ఓ చిత్రం చేయాలనుకున్నారట. ఇప్పటికైనా కుదిరినందుకు మురుగదాస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడూ బాగుంటుంది.
 
  కానీ, ఈసారి ప్రేక్షకులు విభిన్నమైన మహేశ్‌ను చూస్తారు’’ అని మురుగదాస్ తెలిపారు. సుమారు వంద కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, మహేశ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిదనీ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం గురించి మురుగదాస్‌ని అడగ్గా... ‘‘చిత్రీకరణ ప్రారంభమైంది ఇప్పుడే కదా. అప్పుడే బడ్జెట్ గురించి చెప్పడం కష్టమే.
 
  ఆ లెక్క తర్వాత తేలుతుంది. దర్శకుడిగా మంచి చిత్రం ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నిస్తాను. ఎప్పుడూ స్క్రిప్టే బడ్జెట్‌ను నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కి మహేశ్‌బాబు స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారట. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement