విజయమే నా లక్ష్యం : సాయిరామ్‌శంకర్ | Sakshi
Sakshi News home page

విజయమే నా లక్ష్యం : సాయిరామ్‌శంకర్

Published Fri, Sep 13 2013 12:20 AM

విజయమే నా లక్ష్యం : సాయిరామ్‌శంకర్

‘‘జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. అయితే... ఇప్పడు నా ప్రధాన లక్ష్యం విజయాన్ని అందుకోవడమే’’ అంటున్నారు సాయిరామ్‌శంకర్. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా విలేకరులతో సాయి ముచ్చటించారు. ‘1000 అబద్ధాలు’ సినిమా గురించి చెబుతూ -‘‘ఆ సినిమా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందన్నారు. ముఖ్యంగా నా పాత్రను మెచ్చుకున్నారు’ అని చెప్పారు. 
 
అవకాశం ఉంటే మళ్లీ తేజ దర్శకత్వంలో నటించాలని ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం తను గోపీగణేష్ దర్శకత్వంలో ‘రోమియో’, ‘బంపర్ ఆఫర్’ ఫేమ్ జయ రవీంద్ర దర్శకత్వంలో ‘దిల్లున్నోడు’ చిత్రాలు చేశానని, ఈ ఇద్దరు దర్శకులు తన అన్నయ్య శిష్యులే కావడం విశేషమని సాయి చెప్పారు. ‘రోమియో’ చిత్రానికి తన అన్న పూరి జగన్నాథే కథ, మాటలు అందించారని, ఈ చిత్రానికి ‘పూరి రాసిన ప్రేమకథ’ అనే ఉపశీర్షిక కూడా పెట్టామని సాయిరామ్‌శంకర్ తెలిపారు. ‘ఇడియట్’ చిత్రంలో రవితేజ పాత్రలా ‘రోమియో’లో తన పాత్ర ఉంటుందని సాయి చెప్పారు.
 
ఇక ‘దిల్లున్నోడు’ ముక్కోణపు ప్రేమకథ అని ఆయన తెలిపారు. తాను ఏ చిత్రంలో నటించినా ఆ చిత్ర కథ గురించి తన అన్న పూరి జగన్నాథ్‌తో చర్చిస్తానని సాయి చెప్పారు. విజయం అందుకున్న తర్వాత పూరి దర్శకత్వంలో తప్పకుండా సినిమా చేస్తానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని సాయి తెలిపారు.
 

Advertisement
Advertisement