మహేశ్‌ చిత్రంలో నివేదా? | Sakshi
Sakshi News home page

మహేశ్‌ చిత్రంలో నివేదా?

Published Sat, Jun 27 2020 9:22 PM

Nivetha Thomas to Act in Maheshs Sarkaru Vaari Paata Telugu Movie - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అరవింద్‌ స్వామి నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. (మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్‌)

తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర‌ కోసం నివేదా థామ‌స్‌ను చిత్ర బృందం ఎంపిక చేసిందని టాక్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరిపారని తెలుస్తోంది. నటన పరంగా మంచి స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో నివేదా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దర్బార్’ చిత్రంలో ఈ మలయాళ ముద్దుగుమ్మ రజనీకాంత్‌ కూతురుగా నటించి ఆకట్టుకుంది.  (మహేశ్‌-సితు పాప స్విమ్మింగ్‌ పోటీ)

కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్‌ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. అంతేకాకుండా షూటింగ్‌కు అన్నీ కుదిరాక చిత్రీకరణ స్టార్ట్‌ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్‌. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. (మహేశ్‌ సరసన కీర్తి)

Advertisement
Advertisement