సినిమాల్లోనే కొనసాగుతా.. | Sakshi
Sakshi News home page

సినిమాల్లోనే కొనసాగుతా..

Published Sun, Mar 30 2014 10:58 PM

సినిమాల్లోనే కొనసాగుతా..

తాను సినిమాల్లోనే కొనసాగుతానని, రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనేదీ లేదని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పింది. ఒక భారతీయురాలిగా ఓటు మాత్రం వేస్తానంది. మెల్‌బోర్న్‌లో శుక్రవారం ఆరంభమైన భారత మెల్‌బోర్న్ చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ సంగతి తెలిపింది. ఐఎఫ్‌ఎఫ్‌ఎంకు మూడోసారీ ప్రచారకర్త ఎంపికయినందుకు సంతోషంగా ఉందని చెప్పిన విద్య... పద్మశ్రీ అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి సోమవారం వస్తోంది. ‘ప్రతిభ ఉన్న దర్శకులు, నటులతో కలసి పనిచేయడాన్ని తాను ఇష్టపడుతాను. ప్రత్యేకంగా అవార్డుల కోసం ఏ ఒక్క పాత్ర/సినిమా చేయలేదు. సత్తా చూపిస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయి’ అని ఈ 36 ఏళ్ల బ్యూటీ చెప్పింది. విద్యాబాలన్ గర్భిణి అంటూ వచ్చిన వార్తలనూ ఈమె కొట్టిపారేసింది. 
 
 పస్తుతం స్వల్ప విరామం మాత్రమే తీసుకున్నానని, తరచూ షూటింగ్‌లకు వెళ్తున్నానని వివరించింది. అయితే విద్య గత రెండు నెలలుగా షూటింగులకు వెళ్లడం లేదు. ఆమె తాజా సినిమా బాబీ జసూస్ జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కామెడీ సినిమాలో విద్య డిటెక్టివ్‌గా కనిపిస్తుంది. సమర్‌షేక్ దీనికి దర్శకత్వం వహించగా, నటి దియామీర్జా, ఆమె ప్రియుడు రాహుల్‌సంఘా ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తానని చెప్పింది. సుజొయ్ ఘోష్ తాజాగా తీస్తున్న దుర్గారాణి సింగ్‌లో విద్యాబాలన్‌ను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నా, చివరికి కంగనా రనౌత్‌కు అవకాశం దక్కిందని వార్తలు వచ్చాయి. దీని గురించి అడిగితే కంగనకు ఆ సినిమాలో అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యాబాలన్ చెప్పింది.
 

Advertisement
Advertisement