మళ్ళీ మ్యాజిక్? | Sakshi
Sakshi News home page

మళ్ళీ మ్యాజిక్?

Published Tue, Mar 3 2015 11:21 PM

మళ్ళీ మ్యాజిక్? - Sakshi

 ప్రముఖ దర్శక - నిర్మాత మణిరత్నం కొంత విరామం తరువాత మళ్ళీ జనం ముందుకు వస్తున్నారు. కొంతకాలంగా సరైన విజయం కోసం చూస్తున్న ఈ సృజనశీలి గతంలో తనకు అచ్చివచ్చిన వినోదాత్మక ప్రేమకథల ఫార్ములానే మరోసారి ఆశ్రయించారు. ‘ఓ కాదల్ కన్మణి’ (సంక్షిప్తంగా ‘ఓ.కె. కన్మణి’) అంటూ స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ తాజా తమిళ చిత్రం ఏప్రిల్‌లో తమిళ ఉగాది నాడు జనం ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ చిత్రం తమిళ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేశారు. దల్క్వెర్ సల్మాన్, నిత్యా మీనన్‌లు హీరో హీరోయిన్లు. ఆర్కిటెక్ట్ విద్యార్థినిగా నిత్యా మీనన్ వినూత్న పాత్ర పోషిస్తుంటే, ప్రసిద్ధ భారతీయ ఆర్కిటెక్ట్ బి.వి. దోషీ ఆమెకు ప్రొఫెసర్‌గా నటిస్తున్నారు.
 
  ‘రోజా’ ద్వారా తనకు సినీ జీవితమిచ్చిన మణిరత్నమ్ మీద గురుభావంతో ఈ సినిమాకు కూడా ఏ.ఆర్. రహ్మాన్ అద్భుతమైన సంగీతమిచ్చారు. చిత్ర సంగీతం గురించి సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు నిర్వహించిన ఈ చిత్రం తమిళ, మలయాళాలతో పాటు తెలుగులోనూ రానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా కోసం సీతారామశాస్త్రి పాటలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. చెన్నైతో పాటు అహ్మదాబాద్, ముంబయ్‌లలో కూడా షూటింగైన ఈ చిత్రంతో మణిరత్నం మ్యాజిక్ పునరావృతమవుతుందా?
 

Advertisement

తప్పక చదవండి

Advertisement