దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా యూనిట్ పై మరోసారి దాడి జరిగింది. ప్రస్తుతం కొల్హాపూర్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ లో పద్మావతి చిత్ర షూటింగ్ జరుగుతోంది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి సెట్ ను తగలబెట్టారు. అదే సమయంలో లొకేషన్ లోఉన్న వాహనాలు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి అర్ధరాత్రి సమయంలో జరగటంతో యూనిట్ సభ్యులెవరు అక్కడ లేరు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
గతంలో జైపూర్లో షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రయూనిట్పై రాజ్పుత్ కర్నిసేన సభ్యులు దాడి చేశారు. పద్మావతి చరిత్రను వక్రీకరించారంటూ డైరెక్టర్తో పాటు యూనిట్ సభ్యులపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతాల్లో షూటింగ్ అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జరిగిన దాడికి కారకులెవరన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. ఈ సంఘటనపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కార్ యూనిట్ సభ్యులు కంప్లైయిట్ ఇస్తే రాత్రి సమయం కూడా సెక్యూరిటీ ఇస్తామని తెలిపారు.