పురుగు తెచ్చిన తంటా | Sakshi
Sakshi News home page

పురుగు తెచ్చిన తంటా

Published Fri, Aug 23 2013 1:10 AM

పురుగు తెచ్చిన తంటా - Sakshi

ఆ రోజు షూటింగ్ జోరుగా జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా చాలా హుషారుగా ఉన్నారు. బాక్సింగ్ చేయడం మొదలుపెట్టారామె. ప్రత్యర్థి అంతు చూసి, విశ్రాంతి తీసుకుందామని ఓ కుర్చీలో కూర్చుకున్నారు. ఇదంతా జరిగింది మనాలీలో. ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. లొకేషన్లో అక్కడక్కడా పురుగులు కనిపించినా యూనిట్ సభ్యులు పెద్దగా ఖాతరు చేయలేదు. ఒకవేళ వాటివల్ల సమస్య వస్తుందని ముందే ఊహించి ఉంటే.. ముందు జాగ్రత్తలు తీసుకునేవారేమో. 
 
ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది. ఓ పురుగు ప్రియాంకను కుట్టిందట. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న ప్రియాంక ఆ పురుగుని చూసి, తెగ భయపడిపోయారు. దానికి కారణం..  పురుగు చిన్నదే అయినా నొప్పి భరించలేనంత అట. అలాగే శరీరం మీద రాషెస్ రావడంతో ప్రియాంక భయపడిపోయారట. ఇక, ఒక్క క్షణం కూడా ఆ లొకేషన్లో ఉండే ప్రసక్తే లేదని, వెంటనే లొకేషన్ మార్చమని నిర్మాతకు కరాఖండీ చెప్పేశారట ప్రియాంక. 
 
యూనిట్ సభ్యులు ఎన్ని రకాలుగా సర్ది చెప్పినా ప్రియాంక ససేమిరా అనడంతో, చేసేదేం లేక  పేకప్ చెప్పి చిత్రబృందం ముంబయ్ చేరుకున్నారట. అక్కడి ఫిల్మిస్తాన్‌లో సెట్ వేశారట. ఫలితంగా బడ్జెట్ పెరిగిందని బాలీవుడ్ టాక్. అయినా ప్రియాంకకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదట. ‘నా సేఫ్టీ ముఖ్యం కదా’ అని సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారట. 
 
ఈ చిత్రాన్ని ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. భారత బాక్సర్ మేరీ కామ్ జీవితం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో బాక్సర్‌గా ప్రియాంక నటిస్తున్నారు. ఈ పాత్ర పోషణ కోసం ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆ మధ్య మేరీ కామ్‌ని కూడా కలిశారని సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement