రాహుల్, ప్రత్యూష తాగి కొట్టుకునేవారు! | Sakshi
Sakshi News home page

రాహుల్, ప్రత్యూష తాగి కొట్టుకునేవారు!

Published Sat, Apr 2 2016 12:28 PM

రాహుల్, ప్రత్యూష తాగి కొట్టుకునేవారు!

ప్రత్యూషా బెనర్జీ మరణం విషయంలో ఇప్పుడు అనుమానాలన్నీ ఆమె బోయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ మీదకే వెళ్తున్నాయి. వీళ్లిద్దరూ కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్నా, తర్వాత మాత్రం ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగానే అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రత్యూష ఇంటి చుట్టుపక్కల నివసించేవాళ్లు కూడా చెబుతున్నారు. వీళ్లిద్దరూ ఈమధ్య కాలంలో తరచు తాగి గొడవపడేవాళ్లని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగోలేదని తెలుస్తోంది. ఇక ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ రాజ్‌సింగ్ ప్రవర్తన కూడా అనుమానాలకు తావిస్తోంది. తోటి నటీనటులు అతడికి కాల్ చేసేందుకు ప్రయత్నించినా అతడి ఫోన్ మాత్రం స్విచాఫ్ చేసి ఉన్నట్లే వస్తోంది. దీంతో అతడి మీద అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని స్థానికులు, తోటి నటీనటులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు ఏం జరిగిందో స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఇక ప్రత్యూష సూసైడ్ నోట్ విషయం గురించి కూడా పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆమె ఎలాంటి సూసూడ్ నోట్ రాయలేదని నిన్నటి నుంచి వినిపిస్తుండగా.. తాజాగా మాత్రం ఆమె ఒక నోట్ రాసిందని పోలీసు వర్గాల ద్వారా అనధికారికంగా తెలిసింది. అదే నిజమైతే, చిట్టచివరిగా ఆమె తన ఆవేదన ఎలా వ్యక్తం చేసింది, ఎవరిమీదైనా అనుమానాలు వ్యక్తం చేసిందా.. అసలు నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, ఆ లేఖ ఆమె చేతిరాతతోనే ఉందా అనే అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి.

మరోవైపు, రాహుల్ రాజ్‌సింగ్‌ను ముంబై పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలన్ని తాము రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement