‘‘దోమకొండ శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్ల క్రితం మా పూర్వీకులు ఆ ఆలయం చుట్టూ దోమకొండ కోటను నిర్మించారు. 2003లో మా తాతగారు కామినేని ఉమాపతి (దోమకొండ ఫ్యామిలీ 20వ తరం) పురావస్తు శాఖ వారితో కలిసి ఆలయాన్ని పునరుద్ధరించడం మొదలుపెట్టారు. ఇక్కడి శివలింగం విచిత్రమైన నీలం రంగులో ఉంటుంది. నాకు, మిస్టర్ సి (రామ్చరణ్)కి ఆలయాన్ని, దాని పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తే అనుకున్నది జరుగుతుందని నమ్మకం’’ అన్నారు ఉపాసన కొణిదెల.
భర్త రామ్చరణ్తో కలసి శివరాత్రి పర్వదినాన దోమకొండ కోట శివాలయాన్ని సందర్శించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ ఫొటోను ఉపాసన తన ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. కాగా శివరాత్రికి ముందు కొన్ని రోజులు ఉపాసన ఆధ్యాత్మిక యాత్ర వెళ్లారు. ఇందులో భాగంగా ప్రయాగలో జరిగిన కుంభమేళాని సందర్శించారు. ‘‘ఆరు పవిత్ర స్థలాలను సందర్శించాను. కుంభ్ ఓ మంచి అనుభూతి. తేలికగా, సంతోషంగా, నూతనోత్సాహాన్నిచ్చింది. జై శివ శంభో’’ అంటూ ఆ హోలీ ట్రిప్ గురించి పేర్కొన్నారు ఉపాసన.