‘ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు’ | Sakshi
Sakshi News home page

‘నా అంతరాత్మ క్షోభిస్తోంది.. మీరు జోక్‌ చేయట్లేదు కదా?’

Published Mon, Dec 31 2018 11:41 AM

Rani Mukerji Gets Slammed on Social Media Over Her Comments On Metoo Movement - Sakshi

‘నా అంతరాత్మ క్షోభిస్తోంది. ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు. బాధితులే మారాలి గానీ, కారకులకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పాలనుకుంటున్నారా ఏంటి రాణీ గారు!’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. మీరు చెప్పిందే సరైంది అనుకుంటే...నాలుగు నెలల పాపాయి తనపై అకత్యానికి పాల్పడే వ్యక్తిని ఎలా అడ్డుకోగలదు అని ఆమెను విమర్శిస్తున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే... ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చలో బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకొనే, అనుష్క శర్మ , అలియా భట్‌, రాణి ముఖర్జీలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోన్న ‘మీటూ’ ఉద్యమం గురించి వారి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో దీపికా, అనుష్కలు మాట్లాడుతూ ఇంటి తర్వాత మహిళలకు అత్యంత సురక్షితంగా భావించాల్సిన ప్రదేశం పని ప్రదేశమే కాబట్టి వారికి అక్కడ రక్షణ ఉండాలని పేర్కొన్నారు.

కాగా వీరి వ్యాఖ్యలకు స్పందించిన రాణీ ముఖర్జీ..‘ మహిళలు స్వతహాగా బలవంతులుగా ఉండాలి. వేధింపులు ఎదురైనపుడు, అకృత్యాలు జరిగినపుడు వాటిని అడ్డుకునే ధైర్యవంతులై ఉండాలి. అందుకోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి. అప్పుడే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో... ‘ఒక పెద్ద ప్రొడక్షన్‌ హౌజ్‌ కలిగి ఉన్న మహిళ ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. అమ్మాయిలు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని చెప్పారు.. ఇందుకు బదులు ప్రతీ తల్లి తన కొడుకును సత్ప్రవర్తనతో పెంచాలని మీకు అనిపించడం లేదా... మీరు జోక్‌ చేయట్లేదు కదా! పసికందులు ఎన్ని విద్యలు నేర్చుకున్నా మీరు చెప్పినట్లు జరిగే అవకాశమే లేదు’  అని రాణీని విమర్శిస్తున్నారు. ఇక.. రాణీముఖర్జీ బాలీవుడ్‌ బడా నిర్మాత ఆదిత్య చోప్రా భార్య అన్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement