ఔను... వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు! | Sakshi
Sakshi News home page

ఔను... వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు!

Published Sun, Jan 10 2016 1:51 PM

ఔను... వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు!

 అది ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న అవార్డుల వేడుక. అలనాటి స్టార్స్ రిషీ కపూర్, అమితాబ్ బచ్చన్‌ల నుంచి ఈ తరం స్టార్స్ రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, దీపికా పదుకొనే, సోనమ్‌కపూర్ వరకు ఎంతో మంది తారలు ఈ వేడుకకు హాజరై, ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయింది. అవార్డులూ, ఆటపాటలనూ ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీల దృష్టంతా హఠాత్తుగా ముందు వరుసపై పడింది.

అక్కడ అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆ వేడుకకు వచ్చిన నటి రేఖ ఆమె పక్కకు వచ్చారు. ఇప్పుడు వీళ్లిద్దరూ పలకరింపుగా నవ్వుకుంటారా? ఎప్పటిలానే పళ్లు పటపటలాడిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్ చేస్తే.. జయ, రేఖ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జయాబచ్చన్ పక్కనే కూర్చొన్నారు రేఖ. నిన్న మొన్నటివరకూ కనీసం హాయ్ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడని ఆ ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు.

ఇది అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమితాబ్ బచ్చన్-రేఖల మధ్య ఎఫైర్ ఉందని కొన్ని దశాబ్దాలుగా హిందీ పరిశ్రమలో ఓ టాక్. జయాబచ్చన్‌ని పెళ్లి చేసుకున్నాక రేఖతో అమితాబ్ కలిసి నటించకపోవడానికి కారణం కూడా అదే అంటారు. చివరికి జయ-రేఖ మాట్లాడటం కూడా మానేశారు. ఎక్కడైనా ఎదురుపడితే చురుగ్గా చూసుకోవడం తప్ప పలకరింపుగా నవ్వుకున్న దాఖలాలు లేవు. అలా ఏళ్ల తరబడి ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఇలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం టాపిక్ అయ్యింది.
 

Advertisement
Advertisement