Sakshi News home page

ఎమర్జెన్సీ మీటింగ్‌ పెట్టాం

Published Sun, Jul 15 2018 12:49 AM

RX100 Success Meet - Sakshi

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రానికి సర్వత్రా వస్తున్న ప్రశంసలు చూసి ఎమర్జెన్సీ మీటింగ్‌ పెట్టాం. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. మొదటి నుంచీ నాకు సినిమాపై నమ్మకం ఉంది. మౌత్‌ పబ్లిసిటీతో మెల్లగా ప్రేక్షకులకు చేరువవుతుంది అనుకున్నాను. అయితే అందరూ అంతకన్నా గొప్పగా ఆదరిస్తున్నారు’’ అని నటుడు రావు రమేశ్‌ అన్నారు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా రావు రమేశ్, ‘సింధూర పువ్వు’ రాంకీ ముఖ్య పాత్రల్లో అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’.

అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో అజయ్‌ భూపతి మాట్లాడుతూ– ‘‘తొమ్మిదేళ్ల క్రితం నేను పరిశ్రమకి వచ్చాను. మా ఊరి నుంచి కూడా ఎవరూ పరిశ్రమకి రాలేదు. నాతో పాటు, మా అమ్మానాన్నలు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. కోట్లు కుమ్మరించినా కొనుక్కోలేని చాలా విషయాలను నేను మిస్‌ చేసుకున్నాను. అయినా ఇవాళ ఈ సినిమా విజయం వాటన్నిటినీ మరపిస్తోంది’’ అన్నారు.

  ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో 175, ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో మా సినిమా విడుదల చేశాం. తొలిరోజే రూ. 2 కోట్ల గ్రాస్‌ వచ్చింది’’ అన్నారు అశోక్‌ రెడ్డి. ‘‘ధైర్యం చేసి చాలా బోల్డ్‌గా చేశా. అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ‘‘ఈ విజయాన్ని ముందే ఊహించాం. సినిమా పెద్ద హిట్‌ అయినందుకు హ్యాపీ’’ అన్నారు కార్తికేయ.  మ్యూజిక్‌ డైరెక్టర్‌ చైతన్‌ భరద్వాజ్, నేపథ్య సంగీత దర్శకుడు స్మరణ్, కెమెరామేన్‌ రామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement