పెరంబూరు: అభిమాన ధనాన్ని మించింది లేదంటారు. అలాంటి శిష్యాభిమానంలో దర్శకుడు శంకర్ తడిచి ముద్దయ్యారు. ఇండియాలోని స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఖ్యాతి గాంచిన దర్శకుడు శంకర్. జంటిల్మెన్ చిత్రంతో జనూన్ దర్శకుడిగా తమిళసినిమాకు పరిచయం అయ్యారు. ఈయన చిత్రాలన్నీ అద్భుతాలను ఆవిష్కరించినవే. శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ 1997లో విడుదలైంది. దర్శకుడిగా ఆయన 25 వసంతాలను పూర్తి చేసుకున్నారన్నమాట.
ఒక దర్శకుడిగా వరుస విజయాలను సాధిస్తూ రాణించడం ఆసాధారణమే. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎన్ని మంచి ప్రజాదరణ పొందిన చిత్రాలు అందించామన్నదే ముఖ్యంగా భావించేవారు శంకర్. ఆయన ఈ 25 ఏళ్లలో 12 చిత్రాలే చేశారు. ఆయన తాజా చిత్రం 2.ఓ ఎన్నో అద్భుతాలతో త్వరలో తెరపైకి రానుంది. తదుపరి కమలహాసన్ హీరోగా ఇండియన్– 2ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే దర్శకుడిగా ఆదివారం 25 వసంతాలను పూర్తి చేసుకున్న శంకర్ను ఆయన శిష్యులు అట్లీ, మాదేశ్, బాలాజీ శక్తివేల్, హోసిమిన్, వసంతబాలన్, అరివళగన్ అభిమానంతో సత్కరించారు. ఒక జ్ఞాపికను అందించి ఆయనతో ఫొటో కూడా దిగారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ శంకర్ శిష్యుల అభిమానంలో తడిసి ముద్దయ్యాను. మీరు లేనిదే ఈ నా పయనం ఉండదు అని ట్విట్టర్లో పేర్కొన్నారు.