ముంబై: బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్గా అభిమానుల ఆదరణను పొందిన అనిల్ కపూర్ ‘24’ పేరుతో బుల్లితెరపై ప్రసారం కానున్న షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో అనిల్కపూర్ తనయ, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా పాల్గొంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికే అంగీకరించిన సినిమాల జాబితా పెద్దదిగా ఉండడం, ఆమె క్యాలెండర్లో కనీ సం ఒక్కరోజు కూడా ఖాళీ లేకపోవడంతో ఈసారి ఆమెను షోకు తీసుకురాలేకపోతున్నానని అనిల్కపూర్ తెలిపాడు.
ఈ విషయమై ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... ‘బిజీ షెడ్యూల్ కారణంగా సోనమ్ ‘24’లో పాల్గొనలేకపోతోంది. అయితే తదుపరి సిరీస్లో పాల్గొనేందుకు క్యాలెండర్ను కాస్త సర్దుబాటు చేసుకోమని చెబుతా. ఇక షో గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. బుల్లితెర చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన షోగా అభివర్ణిస్తున్నారు. ఓ నిర్మాతగా నేను దీనిని అంగీకరించను. ఎంత ఖర్చవుతుందనే విషయం కంటే కూడా ప్రేక్షకులకు ఎంతమేర వినోదాన్ని పంచగలుగుతున్నామనేదే ఆలోచిస్తా. ఈ షో ద్వారా ప్రేక్షకులు ఎంతో కొంత పొందే అవకాశముంది. అయితే ఇందుకు వారు చాటుకోవాల్సింది వారిలోని నిజాయతీనే.
రియాల్టీ షో మాత్రమేకాకుండా ఓ కాల్పనిక కథలా ఉండేలా, సాధ్యమైనంత వరకు షోలో సహజత్వం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సిరీస్ను నా అభిమానులకే అంకితమిస్తున్నా. కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలనే తపనతోనే ఈ షోలో పాల్గొంటున్నా. అంతేగానీ లాభాలను ఆశించడంలేద’న్నాడు. ఇదిలాఉండగా బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో వచ్చేనెల 4వ తేదీ నుంచి కలర్స్ చానల్లో ప్రసారం కానుంది. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ షోలో మందిరా బేడి, అని తారాజ్, టిస్కా చోప్రా తదితరులు పాల్గొంటుండగా షబానా ఆజ్మీ, అనుపమ్ ఖేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.