'చిరు' ప్రయత్నాలు | Sakshi
Sakshi News home page

'చిరు' ప్రయత్నాలు

Published Mon, Feb 2 2015 3:43 PM

'చిరు' ప్రయత్నాలు - Sakshi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తిరిగి కెమెరా ముందుకు రావడానికి రె'ఢీ' అవుతున్నారు. అందుకోసం ఆయన తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. త్వరలో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక150వ చిత్రం కోసం చిరంజీవి ప్రత్యేకించి 'స్పా' థెరపీ చేయించుకునేందుకు ఏకంగా కేరళ వెళ్లినట్టు సమాచారం. తమ అభిమాన నటుడి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక రకంగా తీపి కబురే. ఎందుకంటే.. ఆయన కెమెరాకు దూరమై దాదాపు ఐదేళ్లు దాటిపోయింది. 2009లో విడుదలైన 'మగధీర' తర్వాత చిరంజీవి కెమెరా ముందుకు రాలేదు.  

భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం చిరంజీవి స్లిమ్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన అత్యంత సన్నిహితుడు తెలిపారు.  చిరు స్టెప్స్ అంటే ఇప్పటి యూత్కు కూడా ఎంతో క్రేజ్. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి తన ఆహార్యం మీద అంతగా శ్రద్ధ తీసుకోకపోవటంతో ఆయన బరువు పెరిగారు.

దాంతో అదనాన్ని తగ్గించుకునేందుకు 'చిరు' ప్రయత్నం చేస్తున్నారట. ఈజీగా మూమెంట్స్ ఇవ్వాలంటే స్లిమ్ అవ్వాలనుకున్నారట. ఇప్పటికే రోజూ వ్యాయామం చేసి కాస్తంత బరువు కూడా తగ్గారట ఈ హీరో.  చిరుతో పాటు పరుచూరి బ్రదర్స్లో ఒకరు కేరళకు వెళ్లినట్లు సమాచారం. చిత్ర కథకు సంబంధించి అక్కడ కూడా చర్చలు జరుపుతున్నారట.
 
సరైన కథ దొరకక ఇన్ని రోజులూ చిరంజీవి  వేచి ఉన్నారని.. ..ప్రస్తుతం కథ సిద్ధమైనట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చేయబోయే ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు కూడా సిద్ధం చేశారు. వీరి కలయిక అంటే అంచనాలను ఊహించలేం. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ఖైదీ, కొండవీటి దొంగ, స్టాలిన్ సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇది మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం అయి ఉంటుందని అందరి అంచనా. ఈ చిత్రానికి దర్శకత్వం చిరంజీవితో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వి.వి.వినాయక్ వహిస్తారట. ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాకి తన కుమారుడు హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాలీవుడ్ టాక్.

Advertisement
Advertisement