బాలీవుడ్‌ను గెలిచిన సుశాంత్‌కు వీడ్కోలు | Sakshi
Sakshi News home page

సుశాంత్‌కు కన్నీటి వీడ్కోలు

Published Mon, Jun 15 2020 6:05 PM

Sushant Singh Rajput Funeral Completed - Sakshi

ముంబై : బాలీవుడ్‌ యువహీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అంత్య క్రియలు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దహన సంస్కారాలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో ప్రస్తుతం పలు లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సుశాంత్ అంత్యక్రియలకు అత్యంత సమీప బంధువులు, కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

సుశాంత్‌ పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో కూపర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా వహన్‌ హాన్స్‌ శ్మశానవాటికకి తరలించారు. అంబులెన్స్‌ ముందు సీట్లో ప్రముఖ నిర్మాత, సుశాంత్‌ స్నేహితుడు సందీప్‌ సింగ్‌ కూర్చోగా, అతని కుటుంబ సభ్యులు నేరుగా శ్మశాన వాటిక దగ్గరకు చేరుకున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఆయన తండ్రితో పాటు మిగతా కుటుంబ సభ్యులు పట్నా నుంచి ఆదివారం మధ్యాహ్నమే ముంబై చేరుకున్నారు. కడసారి సుశాంత్‌ పార్థివదేహాన్నిచూసి ఆయన తండ్రి బోరున విలపించారు. 
(చదవండి : సుశాంత్‌ ఆత్మహత్య; రియాను విచారించిన పోలీసులు)

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం యావత్‌ సినీ లోకాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. కెరీర్‌లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టించింది. రెండేళ్లు థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియ‌ల్‌తో బుల్లితెర‌పై తెరంగ్రేటం చేశాడు. అనంత‌రం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ప‌రిచ‌యమ‌య్యాడు. అలా ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టివ్‌ బ్యోమకేష్‌ బక్షి" చిత్రాలు న‌టుడిగా అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్‌. ధోనీ’తో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయ‌న‌ చివ‌రిసారిగా "చిచోర్" చిత్రంలో క‌నిపించాడు.

Advertisement
Advertisement