ముంబై: ఇష్టపడిన వ్యక్తి నుంచి విడిపోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుందని.. అయితే దురదృష్టవశాత్తూ జరిగే సంఘటనలను ఎవరూ మార్చలేరని బాలీవుడ్ విలక్షణ నటి స్వరభాస్కర్ అన్నారు. ప్రేమలో ఉన్నపుడు ఒకరి కోసం ఒకరు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. సామరస్యపూర్వకంగా విడిపోవడంలో తప్పులేదన్నారు. రాంజానా, తను వెడ్స్ మను, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో స్వరా నటిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2011లో ఓ సినిమా షూటింగ్ సమయంలో స్క్రీన్ రైటర్ హిమాంశు శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధం ఆ తర్వాత బీటలు వారింది. అప్పటి నుంచి ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ‘పింక్విల్లా’తో మాట్లాడిన స్వరభాస్కర్ ప్రేమ- బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. ‘విడిపోవడం అనేది దురదృష్టకరం. అయితే మా విషయంలో పరస్పర నిందారోపణలు లేవు. మా ఇద్దరిలో ఓ ఒక్కరు ఎలాంటి తప్పు చేయలేదు. చెడుగా ప్రవర్తించలేదు. ఎవరినీ ఎవరు మోసం చేయలేదు. మనం ఒక దారిలో ప్రయాణిస్తున్నపుడు అందులో ఎన్నో మలుపులు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నపుడు ఒకరు కుడివైపు.. మరొకరు ఎడమ వైపు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు ఎవరో ఒకరు రాజీ పడాలి. నీతో కలిసి నడుస్తా అని చెప్పాలి. లేదంటే గుడ్ బై చెప్పి వెళ్లాలి. మా విషయంలో ఇదే జరిగింది. ఇతరుల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. నా జీవితంలో ఇలాంటివి ఎదురైనపుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది. కాబట్టి చాలా తొందరగా బాధ నుంచి బయటపడ్డాను’అని పేర్కొన్నారు.