అలలా ఎగసి..కలలా ముగిసి... | Sakshi
Sakshi News home page

అలలా ఎగసి..కలలా ముగిసి...

Published Mon, Dec 15 2014 11:31 PM

అలలా ఎగసి..కలలా ముగిసి...

 చక్రి ధన్యచరితుడు...
 అతి కొద్దికాలంలోనే తన పాటల పండువెన్నెల్లో శ్రోతలను విహరింపజేసి.. ‘వెన్నెల్లో హాయ్ హాయ్...’ అనిపించినవాడు.. రాగాల పరిమళాలను పంచి ‘మల్లెల్లో హాయ్ హాయ్..’ అని పలికించిన వాడు... నాలుగు పదుల వయసులోనే నూరేళ్లకు సరిపడా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు...  జగమంత కుటుంబాన్ని సంపాదించుకున్నవాడు...కొండంత ప్రేమాభిమానాలను మూటగట్టుకొని మరీ నింగికేగినవాడు... అందుకే..చక్రి నిజంగా ధన్యచరితుడు... భౌతికంగా చక్రి అదృశ్యమయ్యాడు... కానీ ఆ సంగీత స్వరఝరి.. నిరంతరం జన హృదయాల్లో పరవళ్లు త్రొక్కుతూనే ఉంటుంది. అలలా ఎగసిన ఆ జీవితం కలలా ముగియవచ్చు..కానీ... ఓ అందమైన జ్ఞాపకంగా మనసుల్ని ఎప్పటికప్పుడు తాకుతూనే ఉంటుంది. ‘నీవె నీవె నీవె మేమంటా... నువ్వే లేక మేమే లేమంటా...’ అంటూ ఆశ్రునయాలతో... ఆర్తిగా...
 
 స్వయంకృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లి చక్రి స్వస్థలం. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అబ్బడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పట్నుంచీ చక్రి బాగా పాడేవారు. కొడుకు మనోభీష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు.కంబాలపల్లిలో పదవ తరగతి వరకూ చదువుకున్న చక్రి... అక్కడే ఫ్లూట్ నేర్చుకున్నారు.
 
 ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకూ మహబూబాబాద్‌లో చదువుతూ.. అక్కడే వయోలిన్, కర్ణాటక సంగీతం అభ్యసించారు.అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా... చక్రి సంగీత విభావరి ఉండాల్సిందే. చక్రి ట్రూప్ పేరు ‘సాహితీ కళాభారతి’. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు... కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా’ అనే పాటను చక్రి స్వయంగా రాసి, స్వరపరిచి ఆలపిస్తే... కాలేజ్ ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. చక్రి ప్రతిభను గమనించిన స్నేహితులందరూ... ‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నీ పాట ఊళ్లల్లో జరిగే శుభకార్యాలకు పరిమితం కాకూడదు. తెలుగు సినీ సంగీతాన్ని శాసించే సత్తా నీలో ఉంది. నువ్వు హైదరాబాద్ వెళ్లు’ అంటూ బతిమాలారట. కానీ... చక్రి మాత్రం పెడచెవిన పెట్టారు.
 
 చక్రిని టీచర్‌గా చూడాలనేది తండ్రి ఆకాంక్ష. కానీ... చక్రికి మాత్రం ఉద్యోగాలపై ఆసక్తి ఉండేది కాదు. ‘ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడలేను’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసేవారు. ‘ఏదైనా వ్యాపారం పెడితే.. తానే పదిమందికి పని ఇవ్వొచ్చు కదా!’ అనుకొని... ఓ రెడీమెడ్ బట్టల దుకాణం పెట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే... చక్రి బట్టల దుకాణం పెట్టడం ఫ్రెండ్స్‌కి ఇష్టం లేదు. వాళ్లు మాత్రం చెవిలో జోరీగల్లా హైదరాబాద్ వెళ్లమని మొత్తుకుంటూనే ఉన్నారు. చివరకు హైదరాబాద్ బస్సెక్కారు చక్రి.
 
 హైదరాబాద్ మహానగరం ఆయనకు అగమ్య గోచరంగా అనిపించింది. ఏం చేయాలో తెలీక అమాయకంగా ఫిలింనగర్ అంతా తిరిగారు. చివరకు పదివేలు ఖర్చు పెట్టి ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. దానికి పేరైతే వచ్చింది కానీ... పైసలు మాత్రం రాలలేదు. దాంతో చేసేది లేక భుక్తి కోసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేశారు. ‘పండు వెన్నెల’ స్ఫూర్తితో... ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తుండేవారు చక్రి. అలా... మూడేళ్లల్లో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. చక్రి జీవితంలో మేలి మలుపు ‘చిరునవ్వు’ మ్యూజిక్ ఆల్బమ్. ‘సన ఆడియో’ వారు చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకంగా ఓ ఆల్బమ్ చేయాలనుకొని చక్రిని సంప్రదించారు. స్వతహాగా చిరంజీవి వీరాభిమాని అయిన చక్రి ఆ ఆల్బమ్ చేయడానికి అంగీకరించారు.
 
 చిరంజీవి పాత పాటలనే రీమిక్స్ చేసి, ఆల్బమ్ చేయాలనేది సన ఆడియో వారి ఆలోచన. అయితే... చక్రి మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తానే స్వయంగా రాసి, స్వరపరుస్తానని చెప్పి, 8 పాటలతో ‘చిరునవ్వు’ ఆల్బమ్‌ని రూపొందించారు. ఆ ఆల్బమ్ విన్న చిరంజీవి... చక్రిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ అల్బమ్‌లోని పాటల్ని ‘చల్లగాలి’ అనే కలంపేరుతో చక్రే రాశారు. చక్రి మంచి గీత రచయిత కూడా. ‘చిరునవ్వు’ పుణ్యమా అని చక్రికి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అరంగేట్రం పెద్ద సినిమాతో చేయాలనుకున్న చక్రి.. చిన్న సినిమా ఆవకాశాలన్ని తోసిపుచ్చారు. తప్పక ఒప్పుకున్న రెండు మూడు చిన్న సినిమాలు విడుదలకు నోచుకోలేదు. చివరకు పూరి జగన్నాథ్ ‘బాచి’ (2000) చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకుగా చేయకుండానే సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది.
 
 గాయకుడిగా... నటుడిగా...
 ‘బాచి’ ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ మినహా ఆ సినిమా ప్రభావం ఆ చిత్ర సాంకేతిక నిపుణులందరిపై పడింది. దాంతో పూరీ తదుపరి చిత్రం ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’కి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకోవద్దని నిర్మాత పట్టుబట్టారు. దాంతో పూరీ... నిర్మాతను వదిలాడు కానీ... చక్రిని వదల్లేదు. అదే కథతో మరో నిర్మాతకు సినిమా చేసిపెట్టాడు. అందుకే... చివరి  శ్వాస విడిచే వరకూ పూరి జగన్నాథ్‌ని దైవంగా భావించారు చక్రి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే.
 
 వంశీ- ఇళయరాజా కాంబినేషన్‌ని ఇష్టపడని శ్రోతలుండరు. వంశీ అభిరుచికి తగ్గట్టుగా ఇళయరాజా మాత్రమే సంగీతం అందించగలరనేది చాలామంది అభిప్రాయం. అయితే... ‘ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో ఆ అభిప్రాయం తప్పని నిరూపించారు చక్రి. ‘వెన్నెల్లో హాయ్.. హాయ్... మల్లెల్లో హాయ్... హాయ్..’ అంటూ సంగీత ప్రియులను వెన్నెల్లో ఓలలాడించేశారు. వంశీ-చక్రి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలూ మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్లే కావడం విశేషం. ముఖ్యంగా ‘గోపీ గోపిక గోదావరి’ చిత్రంలోని ‘నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటే... ప్రాణం విలవిల’ పాటైతే... మొబైళ్లలో కాలర్‌ట్యూన్‌గా మోత మోగించింది.
 
 గాయకునిగా కూడా దాదాపు 150 పాటలు పాడారు చక్రి. ‘సత్యం’ సినిమా కోసం ఆయన పాడిన ‘ఓ చెలియా నీతో స్నేహం కోసం...’ పాటకు గాయకునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోగా, ‘సింహా’కి సంగీత దర్శకునిగా నంది అవార్డు అందుకున్నారు చక్రి. సత్యం, ఎవడైతే నాకేంటి, రంగ ది దొంగ.. తదితర చిత్రాల్లో నటించారు కూడా.
 చక్రి తండ్రి వెంకటనారాయణకు దేశభక్తి, దైవభక్తి మెండు. ఆ విషయంలో కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గరు చక్రి. తన పుట్టిన రోజైన ‘జూన్ 15’ను వివిధ సేవాకార్యక్రమాలతో జరుపుకునేవారు. రక్తదానాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ... ఇలా అభిమానుల హడావిడీ ఆ రోజున అంతా ఇంతా ఉండదు.
 
 స్నేహశీలి: స్నేహానికన్న మిన్న మరొకటి లేదంటారు చక్రి. తనను హైదరాబాద్ వెళ్లమని ప్రోత్సహించింది స్నేహితులేననీ, వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నాననీ అంటారాయన. తుదిశ్వాస విడిచే వరకూ స్నేహితుల్ని విడవలేదు చక్రి. చక్రికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు. తమ్ముడు మహత్ నారాయణ కూడా సంగీత దర్శకుడే.  వారందరినీ ప్రాణంగా చూసుకునేవారు చక్రి.చక్రి జీవితంలో అమితంగా ప్రేమించే వ్యక్తులు ముగ్గురు. వారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి తన తండ్రి వెంకటనారాయణ.  ‘2013లో నేను సంగీత దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఒక సంగీత  దర్శకునిగా అది నాకు పెద్ద బాధే అయినా... అంతకంటే పెద్ద విషాదం నా జీవితంలో మరొకటి జరిగింది.
 
 అదే నాన్న మరణం’’ అంటారు చక్రి. ఇక రెండో వ్యక్తి భార్య శ్రావణి. ‘‘నా జీవితంలో జరిగిన అద్భుతాల్లో ఒకటి... నా అభిమాని శ్రావణి నాకు సహధర్మచారిణి కావడం’’ అని భార్య గురించి మురిసిపోతూ చెప్పేవారు చక్రి. ఇక మూడో వ్యక్తి పూరి జగన్నాథ్. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న తన ఇంటికి ‘పూజ కుటీర్’ అని పేరుపెట్టుకున్నారు చక్రి. ‘పూజ’ అంటే ‘పూరి జగన్నాథ్’ అని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. చనిపోవడానికి కొది గంటల ముందు కూడా ‘‘ఎందుకో ఈ రోజు పూరీ అన్నయ్యను చూడాలని ఉంది’ అని సహచరులతో చక్రి అన్నారు.
 
 కొండంత మనిషి చక్రికి, మనసు కూడా కొండంత పెద్దది. బోళామనిషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. నిత్యం రాగాలతో సరాగాలాడే ఈ సంగీత స్వరఝరి జీవితంలో బంధాలు, బాంధవ్యాలకే పెద్ద పీట. 41వ ఏటకే నూరేళ్లకు సరిపడా కీర్తిని సొంతం చేసుకున్న ఈ స్వరాన్వేషి... అతి చిన్న వయసులోనే దూరమవ్వడం యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, సంగీతాభిమానులందరికీ తీరని లోటు.
 
 ఆగిన స్వరచక్రం
  చక్రి నా బిడ్డ లాంటివాడు. నాకు చాలా నచ్చిన వ్యక్తి. భవిష్యత్తులో అతనితో చాలా సినిమాలు చేయాలనుకున్నాను. ఇంత చిన్న వయసులో ఆయన మరణం నన్నెంతో కలచివేసింది.
  దాసరి నారాయణరావు, దర్శక - నిర్మాత
 
 చక్రి సంగీతానికి అభిమానిని నేను. మనిషిలాగే అతని మనసు కూడా భారీ. నా తమ్ముడు లాంటి చక్రి ఇలా హఠాన్మరణం చెందడం బాధగా ఉంది. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన చక్రి మరణం కళాకారులకూ, కళాభిమానులకూ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
  నందమూరి బాలకృష్ణ, సినీ హీరో
 
 తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు చక్రి. స్వయంకృషితో ఎదిగిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. నేడు నిజంగా దుర్దినం. ఈ బాధను తట్టుకునే శక్తిని చక్రి కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.
 డి.సురేశ్‌బాబు, నిర్మాత
 
 స్నేహానికి విలువిచ్చే గొప్ప వ్యక్తి చక్రి. వాణిజ్య చిత్రాలతో పాటు, విప్లవ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారాయన. చక్రి మరణం యావత్ సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
  ఆర్.నారాయణమూర్తి, నట - దర్శకుడు
 
 గత రాత్రి ఆఫీసు నుంచి తను ఇంటికెళ్లే ముందు ‘ఎందుకో జగన్ అన్నయ్యను చూడాలని ఉందిరా’ అని ఆఫీస్‌బాయ్‌తో అన్నాడట చక్రి. అది తెలిసి నా మనసు భారమైంది. నా తమ్ముణ్ణి కోల్పోయాను. నిజంగా చాలా బాధగా ఉంది. నా సినిమాతోనే తన కెరీర్ మొదలైంది. నా ప్రతి సినిమాకూ అద్భుతమైన సంగీతం అందించాడు చక్రి.
  పూరి జగన్నాథ్, దర్శక - నిర్మాత
 
 చక్రి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయన ప్రతిభను తెలుగు చిత్రసీమ సరిగ్గా వినియోగించుకోలేదనే అనాలి. స్నేహానికి ప్రాణమిచ్చే అలాంటి మంచి మనిషి మరణం తెలంగాణ సినిమాకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకూ తీరని లోటు.
 ఎన్.శంకర్,   ‘జై బోలో తెలంగాణ’ దర్శకుడు


 చెడ్డవాళ్లు కూడా చనిపోయాక మంచి వాళ్లయిపోతారు. కానీ, బతికుండగానే చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్న మా చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
  వైవీఎస్ చౌదరి, దర్శక - నిర్మాత
 
 జగమంత కుటుంబాన్ని సంపాదించుకొని ఏకాకిలా వెళ్లిపోయాడు చక్రి. తను దూరమైనా తన పాట మాత్రం ఎప్పుడూ బతికే ఉంటుంది.
 సుద్దాల అశోక్‌తేజ, సినీ గీత రచయిత
 
 2003లో చక్రి 18 సినిమాలకు స్వరాలందించారు. వాటిలో 13 చిత్రాలు విడుదలయ్యాయి. నేటి సంగీత దర్శకుల్లో ఇది రికార్డ్. పద్నాలుగేళ్ల చక్రి సినీ సంగీత ప్రయాణంలో ఎందరో గాయనీగాయకులను సినీ రంగానికి పరిచయం చేశారు. కౌసల్య, సింహా, గీతరచయిత కందికొండ సహా పలువురు చక్రి ద్వారా వెండితెరకు పరిచయమైనవారే.
 
 - బుర్రా నరసింహ
 

Advertisement
Advertisement