మూడు రోజులాగండి! | Sakshi
Sakshi News home page

మూడు రోజులాగండి!

Published Wed, Jul 26 2017 12:35 AM

మూడు రోజులాగండి! - Sakshi

తప్పదు... ‘హీరోలందు పూరి హీరోలు వేరయా’ అని చెప్పక తప్పదు! ప్రతి హీరోని న్యూ మేకోవర్‌లో చూపించే దర్శకుడు పూరి జగన్నాథ్, ‘పైసా వసూల్‌’లో బాలకృష్ణనూ కొత్తగా చూపించారు. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు పూరి. ఈ నెల 28న ఉదయం10 గంటల 12 నిమిషాలకు ‘పైసా వసూల్‌’ స్టంపర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

సినిమా ఎలా ఉండబోతుందో... ఈ స్టంపర్‌ చూస్తే తెలుస్తుందట. అసలు, ‘స్టంపర్‌’ అంటే ఏంటి? అనడిగితే... ‘‘రెగ్యులర్‌గా అందరూ విడుదల చేసే టీజర్, ట్రైలర్‌లకు భిన్నంగా ఉంటుంది. 28వ తేదీ వరకు వెయిట్‌ చేయండి’’ అంటున్నారు పూరి. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఈ వారంలోనే ప్యాచ్‌ వర్క్‌ పూర్తవుతుంది.

నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘బాలకృష్ణగారితో సినిమా చేస్తున్నందుకు గర్వంగానూ, హ్యాపీగానూ ఉంది. ఆయన పాత్రలో లీనమైన తీరు చూసి ఆశ్చర్యపోయా. నందమూరి అభిమానులు కోరుకునే డైలాగ్స్, సాంగ్స్, మిగతా అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అన్నారు పూరి జగన్నాథ్‌. శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement