సాక్షి, హైదరాబాద్ : సినీ పరిశ్రమపై టీడీపీ నేతలు, ఓ ఛానెల్ యాంకర్ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ముక్త కంఠంతో ఖండించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు
‘ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోని వ్యక్తులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం దారుణం. టీడీపీ నేతల వ్యాఖ్యలు మమల్ని బాధించాయి. హీరో హీరోయిన్ల గురించి మాట్లాడే ముందు ఎవరైనా ఒకట్రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. గతంలో కూడా కొందరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అలాంటి వారిని మీడియా కూడా ప్రొత్సహించొద్దు’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
‘మేం ఊరుకోవాలా?’
కాగా, ఈ మధ్య సినీనటుడు పోసాని కృష్ణ మురళీ పాల్గొన్న ఓ లైవ్ డిబేట్లో మహిళలను ఉద్దేశించి సదరు ఛానెల్ యాంకర్ అసభ్యకరంగా మాట్లాడటం.. దానిపై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాది మీడియాపై నిరసన కాదు.. ఓ విలేకరి చేసిన విమర్శ తట్టుకోలేనిదిగా ఉంది. మేము తప్పులు మాట్లాడినా ..మమ్ముల్ని మీ టీవీలకి డిబేట్లకు పిలవొద్దు. అందరికీ మేమే టార్గెట్ అవుతున్నాం. మా గురించి చెడుగా మాట్లాడినా మౌనం వహించాలా? ఊరుకోవాలా? ఇప్పటికైనా ఆయన(ఎడిటర్ను ఉద్దేశించి) క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ఎన్ శంకర్, మా అధ్యక్షుడు శివాజీరాజా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటి లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఎవరెవరు ఏం అన్నారంటే...
* మా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో.. నటుడు బాలకృష్ణ ఉన్న పార్టీలో ఉన్న ఒక మనిషి మమ్ముల్ని తిట్టాడు. ఆయన గారు ఎప్పుడైనా ఒక టిక్కెట్టు కొని సినిమా చూశారా? : శివాజీ రాజా
* మీకు మా ఫోటో లు కావాలి. మా ఇంటర్వ్యూ లు కావాలి. రోజు మా స్టూడియోలకి వస్తారు. కానీ, మమ్మల్ని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? : సుప్రియ
* సినిమా వల్ల మీద వ్యాఖ్యలు చేసిన యాంకర్పై ఛానెల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి : దర్శక నిర్మాత తమ్మారెడ్డి
*మా ఇంట్లో అందరూ డాక్టర్స్. నేను ఒక్కదాన్నే సినిమాల్లోకి వచ్చాను. అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయి 24 గంటలు అవుతున్నా మీ నుంచి కనీస స్పందన లేదు. సిగ్గులేదా? మీరంతా చావండి అన్నారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కూర్చొని టీవీ చూసేటప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు వస్తే ఏంటి పరిస్థితి? : దర్శకురాలు నందిని రెడ్డి
*సినిమా వాళ్ళ మీద ప్రోగ్రాంలు చేస్తారు. వాళ్ళని తిడతారు. శ్రీదేవి విషయంలో కూడా రేటింగ్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. రెండు రోజుల తరువాత ఏం చేశారు? మొన్న ఈ మధ్య ఓ అమ్మాయిని పెట్టి 3 గంటలు లైవ్ ఇచ్చారు. ఇదేనా చేసేది? : నటుడు జెమిని కిరణ్
*ప్రతి వాళ్ళ కు సినిమా వాళ్ళు కావాలి. మిగతా సమయంలో చీమ చిట్టుక్కుమన్నా రచ్చ చేసే ఛానల్స్.. వెబ్ సైట్స్.. ఒక చిన్న న్యూస్ కూడా పెట్టలేదు. ఇదేనా చేసేది? : నిర్మాత స్వప్నదత్
*నన్ను కాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే.. అలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదనే చెబుతా. మా పేరెంట్స్కి తెలుగు రాదు. తెలుగు తెలిసి ఉంటే మా పేరెంట్స్ నన్ను సినిమాలోకి రానిచ్చే వాళ్లు కాదేమో : నటి రకుల్
*మాపై ఆధారపడే వారి కోసం అనారోగ్యానికి కూడా లెక్కచేయకుండా మేం షూటింగ్లకు వెళ్తాం. అలాంటిది మా గురించి చెడుగా మాట్లాడితే ప్రెస్ క్లబ్ ఎందుకు ఖండించలేదు. దయచేసి మా గురించి సానుకూలంగా ఆలోచించి కథనాలు ఇవ్వండి : మంచు లక్ష్మీ ప్రసన్న