అపోహలు తొలగిపోయాయి | Sakshi
Sakshi News home page

అపోహలు తొలగిపోయాయి

Published Wed, Feb 5 2014 3:36 AM

అపోహలు తొలగిపోయాయి

నటి త్రిష, నయనతార ఇద్దరూ క్రేజీ భామలే. ఇద్దరు అభినయరాణులే. ఇద్దరు అభిమానధనం గలవారే. అలాంటి వీరి ముఖాలు ఎప్పుడూ లేనంతగా కాంతులీనుతున్నాయి. అందుకు కారణం వీరి అనూహ్య కలయికనే. దీంతో ఇద్దరూ పరవశంతో కూడిన కౌగలింతలు చూపరులను ముచ్చటగొలిపాయి. ఈ ఆనంద తరుణానికి ఇటీవల ముంబయిలో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం  వేదిక అయ్యింది. నిజానికి త్రిష, నయనతార మధ్య మొన్నటి వరకు స్నేహం లేదు. మరీ చెప్పాలంటే ఒకరికొకరు శత్రువుల్లా ప్రవర్తించారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలతో కత్తులు దూసుకున్నంత పని చేశారు. వీరి కోల్డ్ వార్‌కు అపోహలే కారణం అంటూనే ఒకరి కొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం విశేషం. ఇప్పుడీ బ్యూటీలు ఏమంటున్నారో చూద్దాం. 
 
 నయనతార ఏమన్నదంటే..
 త్రిషను నేనెప్పుడైతే తొలిసారిగా కలిశానో అప్పటి నుంచి ఆమెను చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో ఎక్కడ కలిసినా ఒక మంచి స్నేహితురాలిగానే ట్రీట్ చేస్తూ వచ్చాను. మేమిద్దరం సినిమాలో ఇంచుమించు ఒక్కటిగానే ఎదుగుతూ వచ్చాం. అలాంటిది మధ్యలో కొందరి కథనాల వలన దూరమైన మాట నిజమే. ఆ తరువాత ఇద్దరి మధ్య పోటీతత్వం పెరిగింది. కెరీర్ విషయంలో మేమిద్దరం చాలా మెచ్యూర్‌గా ప్రవర్తించాం. తాము చాలా కాలం క్రితం ఈ ఫిలింఫేర్ పార్టీలోనే కలిసి మాట్లాడుకున్నాం. త్రిష చాలా పాజిటివ్ పర్శన్. చాలా జాగ్రత్తతో పాటు జాలీగా ఉండే వ్యక్తి. పరిశ్రమలో పదేళ్లుగా తన స్థానాన్ని పదిల పరచుకుంటూ వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం నిలదొక్కుకున్న నటి త్రిష. ఈ విషయంలో ఆమెను చూసి గర్వపడుతున్నాన ని అన్నారు.
 
 త్రిష చెప్పుకొచ్చింది ఇలా..
 నయనతార నేను కొంతకాలం శత్రువులుగా మసలుకున్న మాట నిజమే. అది కొందరి అభూత కల్పనలే. ఈ  అపార్థాలకు దారితీసిన అపోహలన్నీ కరిగిపోయాయి. మేమిప్పుడు మంచి స్నేహితులం అయిపోయాము. నా తొలి చిత్రం విడుదలవుతుందంటే తొలి శుభాకాంక్షలు తెలిపేది నయనతారనే అని అంటోది త్రిష. వీరి నయా ఫ్రెండ్‌షిప్ చూసి అవాక్కు అవడం ప్రేక్షకులవంతయింది.

Advertisement
Advertisement