పాంచ్ పటాకాగా చెన్నై చిన్నది | Sakshi
Sakshi News home page

పాంచ్ పటాకాగా చెన్నై చిన్నది

Published Mon, Sep 12 2016 1:22 AM

పాంచ్ పటాకాగా చెన్నై చిన్నది

 చెన్నై చిన్నది త్రిష పాంచ్ పటాకాగా పేలనున్నారన్నది తాజా సమాచారం. కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ వంటి అగ్రనాయకులందరితోనూ నటించిన నటి త్రిష ఒక దశలో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. నిర్మాత, వ్యాపాత వేత్త వరుణ్‌మణియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన త్రిషకు అది వివాహనిశ్చితార్థంతోనే ఆగిపోయిన విషయం విదితమే.వ్యక్తిగత జీవితంలో అలాంటి బ్రేక్ పడినా వృత్తిపరంగా మాత్రం బ్రేకులు లేని బండిలా యమా స్పీడ్ అందుకుంది.అప్పటి వరకూ అందచందాలతోనే సరిపెట్టుకున్న త్రిషకు ఆ తరువాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వరించడం విశేషం.
 
 ఆ మధ్య నాయకి అనే హార ర్ కథా చిత్రంలో ద్విపాత్రాభినం చేసిన ఈ భామ తాజాగా ఆ తరహా కథతోనూ మోహిని అనే చిత్రం చేస్తున్నారు. ఇదే తరహాలో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన త్రిష తాజాగా మరో విభిన్న కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ ఒకటీ, రెండు పాత్రల్లోనే నటించిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో ఏకంగా ఐదు పాత్రల్లో నటించనున్నారట. ఇందులో రెండు పాత్రల కోసం తన బరువును మరింత తగ్గించుకుని నటించనున్నారట.
 
 ఇకపోతే ఈ చిత్రం కోసం త్రిష కోటి రూపాయలను పారితోషికంగా పుచ్చుకోనున్నారట. అంతేకాదు కాస్ట్యూ మ్స్ కోసం మరో 25 లక్షలు తీసుకుంటున్నారట. ఇందులో నాజర్, ఆనందరాజ్ ముఖ్యపాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఇంతకు ముందు శరత్‌కుమార్ హీరోగా రహస్య పోలీస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఇళవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ప్రస్తుతం మోహినీ చిత్రం కోసం లండ న్‌లో ఉన్న త్రిష ఆ చిత్రాన్ని పూర్తి చేసి పంచ పాత్రల చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement