త్వరలో తెరపైకి ఏమాలి! | Sakshi
Sakshi News home page

త్వరలో తెరపైకి ఏమాలి!

Published Sun, Jan 28 2018 5:14 AM

yemaali releasing shortly - Sakshi

తమిళసినిమా: ఏమాలి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అజిత్, విక్రమ్, శింబు వంటి స్టార్‌ హీరోలతో చిత్రాలు చేసిన దర్శకుడు వీజెడ్‌.దురై చిన్న గ్యాప్‌ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం యేమాలి. లతా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.లత నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రకని, శ్యామ్‌ జోన్స్‌ హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా అతుల్య, రోషిణి నటిస్తున్న ఇందులో సంగంపులి, బాలశరవణన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్యామ్‌ డి.రాజ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు వీజెడ్‌.దురై వివరిస్తూ ఇది నలుగురు న్యాయవాదుల చుట్టు తిరిగే ఇతివృత్తంగా ఉంటుందన్నారు.

ఇందులో సముద్రకని, శ్యామ్‌ కూడా న్యాయవాదులుగా నటిస్తున్నారని, వారి పాత్రలు కొత్త డైమన్షన్‌లో ఉంటాయని ముఖ్యంగా సముద్రకనిని ఇంతకు ముందు నటించనటువంటి వైవిధ్య పాత్రల్లో చూస్తారని తెలిపారు. యేమాలి అంటే మోసపోయేవాడు అని అర్థం అని, అయితే ఈ చిత్రంలో మరో అర్థం కూడా ఉందని అదే ఈ చిత్రంలో సర్‌ప్రైజ్‌గా ఉంటుందని అన్నారు. ఇక నటి అతుల్యరవి అల్డ్రామోడ్రన్‌ గర్ల్‌గా నటించిందని చెప్పారు. తను సముద్రకనికి జంటగానూ, బెంగళూర్‌కు చెందిన రోషిణి శ్యామ్‌కు జంటగానూ నటిస్తున్నారని చెప్పారు. తన గత చిత్రాలకు మాటలను అందించిన జయమోహన్‌ ఈ చిత్రానికి చాలా పవర్‌ఫుల్‌ సంభాషణలను అందించారని చెప్పారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. తాను పూర్తి ఎఫర్ట్‌ పెట్టి తెరకెక్కించిన చిత్రం ఏమాలి అని తెలిపారు.

Advertisement
Advertisement