నిర్వాసితులకు న్యాయం చేస్తాం | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు న్యాయం చేస్తాం

Published Sun, Dec 31 2017 3:01 AM

We will do justice to the expatriates - Sakshi

దేవరకొండ: పెండ్లిపాకల రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో నాయిని నర్సింహారెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నక్కలగండి ప్రాజెక్టును సంద ర్శించారు. పెండ్లిపాకల పనుల్లో ఏజెన్సీ అలసత్వం వహిస్తోందని, అలసత్వం వీడకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని చెప్పారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో భూ సేకరణ సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు హామీనిచ్చారు.

నక్కలగండి సొరంగమార్గం తవ్వకాల్లో వినియోగిస్తున్న యంత్రాల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు విదేశాల నుంచి సామగ్రిని తెప్పించినట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాదు.. ఉత్తరకుమార్‌రెడ్డి అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. వారి వెంట నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు. 

యాడీ.. వారుచి కాయ్‌ 
చందంపేట (దేవరకొండ): ‘‘యాడీ..వారుచి కాయ్‌.. తారీ సమస్యలు.. కాయ్‌ చికాయ్‌.. తారి తరఫున సర్కార్‌ చ్ఛాయ్‌(అమ్మ బాగున్నారా, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా.. ప్రభుత్వం మీ సమస్యలను పరి ష్కరిస్తుంది)’’ అంటూ లంబాడీ భాషలో మహిళలను హరీశ్‌రావు పలకరించారు. శనివారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి బండ్‌ పనులను పరిశీలించిన ఆయన కొంతమంది గిరిజన మహిళలతో ముచ్చటించారు. అక్కడే ఉన్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌లు హరీశన్నకు అన్ని భాషలొస్తాయని నవ్వుతూ అన్నారు.  

Advertisement
Advertisement