గుండెను మెలిపెట్టే విషాదమిది.. | Sakshi
Sakshi News home page

గుండెను మెలిపెట్టే విషాదమిది..

Published Wed, Apr 20 2016 7:15 PM

గుండెను మెలిపెట్టే విషాదమిది.. - Sakshi

ముంబయి: మహారాష్ట్రలో గుండెను మెలిపెట్టే విషాదం చోటుచేసుకుంది. అక్కడి నీటి కరువుకు భరించలేని ఎండ తోడై ఓ బాలిక ప్రాణాన్ని హరించింది. తన ఇంటికోసం సుదూరంగా ఉన్న ఓ నీటి పంపు నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు అదే పనిగా ఎండలో తిరగడమే ఆ బాలిక ప్రాణం పోవడానికి కారణమైంది. తీవ్ర వడదెబ్బ తగిలి బాలిక మృత్యువాత పడింది. బీడ్ జిల్లాలోని సబాకడ్ గ్రామంలో తీవ్ర నీటి కరువు ఉంది. దీంతో ఆ ఊరికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న చేతిపంపు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఆ పంపునకు రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎండ తీవ్రత కూడా పట్టించుకోకుండా ఎప్పుడు వీలయితే అప్పుడు నీళ్లు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఐదో తరగతి చదువుతున్న యోగితా అశోక్ దేశాయ్ (12) అనే బాలిక తన ఇంట్లోకి మంచి నీళ్లకోసం నడి ఎండలో పలుమార్లు తిరిగింది. అలా తిరుగుతూనే అనూహ్యంగా ఓ సారి కుప్పకూలింది. ఆ వెంటనే ఒకే సారి తీవ్ర అనారోగ్యానికి లోనై ప్రాణాలు విడిచింది. డిహైడ్రేషన్ సమస్య ఏర్పడి ఫలితంగా గుండెపోటు వచ్చి ఆ బాలిక ప్రాణాలు విడిచిందని వైద్యులు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో కరువు సమస్య తలెత్తడం ఇది నాలుగోసారి.

Advertisement
Advertisement