హిమపాత మృతులు 20 | Sakshi
Sakshi News home page

హిమపాత మృతులు 20

Published Sat, Jan 28 2017 3:04 AM

హిమపాత మృతులు 20

కశ్మీర్‌లో మంచు బీభత్సం
శ్రీనగర్‌: కశ్మీర్‌లో హిమపాతం, కొండచరియలు పడి మరణించిన వారి సంఖ్య ఇరవైకి చేరింది. వారిలో 14 మంది సైనికులే. శుక్రవారం కూడా హిమపాత బీభత్సం కొనసాగింది. సహాయక బృందాలు మరో నలుగురు సైనికుల మృతదేహాలను గుర్తించాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా సైనికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాతావరణం మెరుగైన తరువాత జవాన్ల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని రక్షణశాఖ అధికారి  తెలిపారు. హిమపాతాల్లో మరణించిన సైనికులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాపం ప్రకటిస్తూ ఆర్మీ చీఫ్‌ బిపిన్  రావత్‌కు లేఖ రాశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కర్ణాటక జవాన్  మృతి: జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్  లో సైనిక శిబిరాలపై గురువారం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సైనికుడు సందీప్‌శెట్టి(28) మరణించారు. అలాగే మేజర్‌ శ్రీహరి గాయపడ్డారు. హసన్  జిల్లా శాంతిహోబళి దేవిహళ్లి గ్రామానికి చెందిన సందీప్‌శెట్టి ఏడేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ఫిబ్రవరి 22న ఆయన వివాహం జరగాల్సి ఉంది. అయితే శెట్టి మరణంపై ఆర్మీ నుంచి జిల్లా అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది. కొండచరియల కింద చిక్కుకున్న బెళగావికి చెందిన మేజర్‌ శ్రీహరి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement