వణికిస్తున్న ‘నిఫా’ : పెరుగుతున్న మృతులు | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న ‘నిఫా’ : పెరుగుతున్న మృతులు

Published Mon, May 21 2018 9:48 AM

9 die in Kerala due to high fever; 2 confirmed cases of Nipah virus - Sakshi

సాక్షి, కాజికోడ్‌: కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోళికోడ్(కాలికట్) జిల్లాలో ఈ వ్యాధి ప్రకంపనలు సృష్టిస్తోంది.   ఇప్పటికే ఈ వైరస్  బారిన పడి పదకొండు మంది మృత్యువాత పడ్డారు.  మరికొందరి పరిస్థితి విషమంగా  వున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం  ఈ వ్యాధి  సోకిందనే అనుమానాలతో  దాదాపు 25మందిని  అబ్జర్వేషన్‌లో ఉంచారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు హై అలర్ట్‌ జారీ చేశారు.    తాజా పరిస్థితులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని రాష్ట్ర ఆరోగ్య విభాగం  డైరెక్టర్‌ డా. ఆర్‌ఎల్‌ సరిత వెల్లడించారు.  తీవ్రమైన  జ్వరంతో బాధపడుతూ  తొమ్మిదిమంది  మరణించారని చెప్పారు. శాంపిళ్లను పరీక్షలకోసం పుణేలోని పరిశోధనా కేంద్రానికి పంపించామన్నారు.  అటు జిల్లా కలెక్టర్‌ యూవీ జోస్‌ నేతృత్వంలోని ఒక టాస్క్‌ఫోర్స్‌ బృందం పరిస్థితిని పరిశీలిస్తోంది.

మరోవైపు ఈ డెడ్లీ వైరస్‌ విస్తరణపై  కేంద్రం కూడా స్పందించింది. జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేరళకు వెళ్లాల్సిందిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా  ఆదేశించారు. ఈ మేరకు జాతీయ బృందం వెళ్లి అక్కడి పరిస్థితిపై సమీక్షించనుందని ట్విటర్‌లో వెల్లడించారు. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిపై సమీక్షపై నిర్వహించాం. జాతీయ వ్యాధి నివారణ బృందాన్ని అక్కడికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని జేపీ నడ్డా ఆదివారం పేర్కొన్నారు. నిఫా వైరస్(ఎన్ఐవి) మనుషుల్లో తీవ్రమైన  జ్వరం,  శ్వాసకోశ సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయి. కాగా,  పళ్లను తినే  గబ్బిలాలు, ఇతర జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇప్పటివరకు దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళనకు గురి చేసే అంశం.

Advertisement
Advertisement