చండీగఢ్: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిల్చొని ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన భటిండా జిల్లాలోని బుచోమండి పట్టన శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. భటిండా-బర్నాల రహదారిలో అప్పుడే బస్సు దిగి మరో బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులపైకి ఓ ట్రక్ దూసుకెళ్లింది.
ఈ ఘటనలో 9 మంది విద్యార్థులు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అదికారులు సహాయకు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో ముగ్గురు మృతి చెందారు.