వేరొకరిని ప్రేమించిందని కక్షగట్టి..! | Sakshi
Sakshi News home page

వేరొకరిని ప్రేమించిందని కక్షగట్టి..!

Published Sat, Dec 24 2016 8:09 AM

వేరొకరిని ప్రేమించిందని కక్షగట్టి..! - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెర్సిడిస్ కారులో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేరే వ్యక్తితో లవ్ అఫైర్ ఉందన్న అక్కసుతోనే హత్యచేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. సౌత్-వెస్ట్ డీసీపీ సురేందర్ కుమార్ కథనం ప్రకారం.. కొన్ని రోజుల కిందట స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన సిమ్రన్(17) ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ తర్వాత ఇద్దరితో కలిసి మెర్సిడిస్ కారులో ఇంటి సమీపానికి చేరుకుంది. ఓ యువకుడు కారు దిగి వెళ్లిపోయాడు. కారులోనే ఉన్న శుభం గుప్తా, సిమ్రన్‌ను ఆమె తల్లి చూస్తుండగానే తుపాకీతోనే కాల్చేశాడు.

ఆ వెంటనే సిమ్రన్ తల్లి ఇంటి ముందున్న కారు వద్దకు పరుగున వెళ్లి చూడగా కూతురు అప్పటికే చనిపోయింది. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యకు కొంత సమయం ముందు వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలు సిమ్రన్ మొబైల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా నిందితుడి కోసం గాలించి, దక్షిణ ఢిల్లీలోని ఓ బంధువు ఇంట్లో తలదాచుకున్న శుభమ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేందర్ కుమార్ తెలిపారు.

నితిన్ అనే మరో వ్యక్తితోనూ సన్నిహితంగా ఉండటం, తనకు అబద్ధాలు చెప్పడంతో హత్యచేసినట్లు నిందితుడు శుభమ్ గుప్తా వెల్లడించాడు. తన తల్లి పోన్ చేపినప్పుడు నితిన్ లాగా మాట్లాడాలని చెప్పడంతో శుభమ్‌కు విపరీతమైన కోపం వచ్చింది. అంతకుముందు ఇద్దరు ఓ పార్టీకి వెళ్లగా తీసుకున్న ఫొటోలలో.. చేతిలో పిస్తోల్‌తో దిగిన ఫొటోకు అన్ని బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి అని క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ఇంటి ముందు కారు ఆపిన తర్వాత.. నితిన్ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, వెంటనే తుపాకీతో కాల్చేశానని చెప్పాడు. కాల్పులు జరిపిన అనంతరం తాను భయంతో అక్కడినుంచి పారిపోయానని నిందితుడు పూర్తి వివరాలను పోలీసులకు తెలిపాడు. సిమ్రన్ మొబైల్ ఆధారంగానే కేసు మిస్టరీని త్వరగా ఛేదించగలిగామని పోలీసులు వివరించారు.

Advertisement
Advertisement