తెలుగు, తమిళ సినిమాల్లో నటించి.. అభిమానుల్ని అలరించిన ప్రముఖ హీరోయిన్ నమిత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరింది. శనివారం తిరుచ్చిలో జయలలిత ఎన్నికల సభ సందర్భంగా ఆమె అన్నాడీఎంకే కండువాను కప్పుకుంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉందని, తనను అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని నమిత గతంలో లేఖ రాసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు అంగీకరించింది. దీంతో జయలలిత ఆమెను పార్టీలో చేర్చుకున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'సొంతం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నమిత.. అటు కొలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో 'జెమినీ', 'బిల్లా', 'సింహా' వంటి సినిమాల్లో నటించిన నమిత తమిళంలో మాత్రం తన అందచందాలతో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. విజయ్కాంత్ సరసన 'ఎంగల్ అన్న' సినిమాతో కొలీవుడ్కు పరిచయమైన నమిత.. అజిత్ సరసన 'బిల్లా' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తమిళంలో టాప్ హీరోల సరసన నటించి అభిమానుల్ని మెప్పించింది.
ఈ భారీ సుందరి అందానికి ఫిదా అయిన తమిళ తంబిలు.. అప్పట్లో ఆమెకు ఓ గుడి కూడా కట్టించారు. అయితే, ఇటీవలికాలంలో నమితకు తెలుగులోనూ, తమిళంలోనూ అవకాశాలు తగ్గాయి. హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సెంకండ్ హీరోయిన్ చాన్స్ వస్తున్నప్పటికీ పెద్దగా కెరీర్లో ఊపులేకపోవడంతో ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది.