సాహసమే ఊపిరిగా..! | Sakshi
Sakshi News home page

సాహసమే ఊపిరిగా..!

Published Wed, Jan 6 2016 6:45 AM

సాహసమే ఊపిరిగా..!

లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఈకే నిరంజన్ ప్రస్థానం
♦ ఎఫ్‌బీఐ వద్ద ప్రత్యేక శిక్షణ; అత్యంత ధైర్యవంతుడిగా పేరు

 న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఆపరేషన్‌లో ఎన్‌ఎస్‌జీకి చెందిన బాంబ్ స్క్వాడ్ కమాండింగ్ ఆఫీసర్, లెఫ్ట్‌నెంట్ కల్నల్, గ్రూప్ కెప్టెన్ ఈకే నిరంజన్(34) ప్రాణాలొదలగా.. మరో 21 మంది ఎన్‌ఎస్‌జీ కమాండోలు గాయపడ్డారు. ఆపరేషన్‌లో బాంబులను నిర్వీర్య దళానికి నిరంజన్ నేతృత్వం వహించారు. ఓ ఉగ్రవాది మృతదేహంపై ఆయుధాలను, మందుగుండును తీస్తుండగా మృతదేహంపై దుస్తుల్లోదాచిన ఒక గ్రెనేడ్ పేలి ఆయన, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిరంజన్ ఆస్పత్రిలో చివరి శ్వాస విడిచారు. 1984లో ఎన్‌ఎస్‌జీ మొదలైనప్పట్నుంచి ప్రాణాలర్పించిన అధికారుల్లో ఆయన 19వ వారు. ఆర్మీలోని ఇంజనీర్స్ రెజిమెంట్ నుంచి డిప్యుటేషన్‌పై మే 2014లో ఆయన ఎన్‌ఎస్‌జీలో చేరారు. అత్యంత సాహస అధికారిగా  పేరుంది.పేలుడుపదార్థాల నిర్వీర్యంలో అమెరికా ఎఫ్‌బీఐ వద్ద శిక్షణ పొందారు.

 నిరంజన్ అంత్యక్రియలు పూర్తి
 నిరంజన్ అంత్యక్రియలు కేరళలోని పాలక్కడ్‌లో సైనిక లాంఛనాలతో జరిగాయి. కన్నీళ్లతో కుటుంబ సభ్యులు, స్థానికులు అంతిమ వీడ్కోలు పలికారు. కాగా, ఓ స్థానిక కేరళ డైలీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అన్వర్ సాదిక్ అనే యువకుడు.. నిరంజన్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేయటంతో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సదరు డైలీ ఫిర్యాదుతోనే రాజద్రోహం కేసు పెట్టారు.

Advertisement
Advertisement