జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం! | Sakshi
Sakshi News home page

జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం!

Published Thu, May 7 2020 6:54 PM

AIIMS director  Warns Coronavirus Likely To Peak In India In June To July - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు జూన్, జులై మాసాల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..  ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలై మాసాలలో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. (చదవండి :  పాలు, మందు దుకాణాలు తప్ప అన్ని బంద్‌)

మోడలింగ్ డేటా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. కానీ కేసుల సంఖ్య పెరగడాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని, ఈ అంచనాలు ఎంత మేర నిజం అవుతాయి, లాక్‌డౌన్ పొడిగించిన ప్రభావం ఎంత మేర ఉంటుందనేది టైం గడిస్తేనే చెప్పగలమన్నారు. ‘రాబోయే ఆరు వారాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ సమయంలో లాక్‌డౌన్‌ ఉండకపోవచ్చు. దీంతో కేసులు సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాధితులను త్వరగా గుర్తించి వారికి చికిత్స అందించడం వల్లే కరోనాను కట్టడి చేయగల్గుతాం’ అని గులేరియా అన్నారు. రెడ్ జోన్స్, కరోనా హాట్‌‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క​రోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ తయారిపై స్పష్టత లేనందున భవిషత్తు ఆందోళన తప్పదని వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్లో ప్రయత్నం చేస్తోందని అన్నారు (చదవండి : 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌)

కాగా,భారత్‌లో ఇప్పటి వరకూ(గురువారం ఉదయం 8 గంటల వరకు)  52,952 వేల కోవిడ్ కేసులు నమోదు కాగా, 1783 మంది చనిపోయారు. ఇప్పటివరకు 15,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి  అయ్యారు. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement
Advertisement