సాక్షి, భువనేశ్వర్ : ఒడిశాలోని కలహంది జిల్లాలో ఏటా ఘనంగా జరిగే ఓ జాతరకు సంబంధించి సుప్రీం కోర్టు ఉత్తర్వులను ప్రజలు పట్టించుకోలేదు. భవానీపట్నంలోని దేవీ మాణికేశ్వరి పీఠం అమ్మవారి విజయ్ ప్రతిమ ఛాటర్ ఉత్సవంలో మొక్కుల పేరిట ఒక్కరోజే లక్షల్లో జంతువులను బలి ఇస్తుంటారు.
అయితే సుప్రీం కోర్టు కొంత కాలం క్రితం సామూహిక జంతు వధను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ యేడాది జీవ హింస దృశ్యాలు కనిపించవనే అంతా అనుకున్నారు. ‘కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల రోజులుగా కృషి చేశాం. ఎన్జీవోల సహకారంతోపాటు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం. అయినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది’ అని జిల్లా కలెక్టర్ అంజన్ కుమార్ తెలిపారు. బుధవారం సుమారు లక్షన్నర మందికి పైగా ఈ జంతు వధలో పాల్గొన్నట్లు అంచనా.
అశ్వనీయుజ మాసం శుక్ష పక్షం అష్టమ తిథి నాడు ముందస పేరిట సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించిరాపై దేవతామూర్తి విగ్రహాన్ని విజయ్ ప్రతిమ ఛాటర్ పేరిట బయటకు తీసుకొస్తారు. అక్కడ ప్రజల దర్శన సమయంలోనే జంతువులను వరుసగా బలి ఇచ్చేస్తారు. అయినా చట్టాల ఉల్లంఘన సర్వసాధారణంగా మారిపోయిన ఈ రోజుల్లో నిషేధాజ్ఞలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నది కొందరి భక్తుల వాదన.