‘అందుకే స్మృతి గెలిచింది’ | Sakshi
Sakshi News home page

‘స్మృతి తప్ప నన్నెవరూ పట్టించుకోలేదు’

Published Fri, May 31 2019 12:40 PM

Asha Bhosle Praises Smriti Irani As She Cares About Her - Sakshi

‘ ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నేను రద్దీలో చిక్కుకుపోయాను. స్మృతి ఇరానీ తప్ప నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ జనంలో నా ఇబ్బందిని గమనించింది. నేను ఇంటికి క్షేమంగా చేరానని తెలుసుకునే దాకా ఆమె మనసు కుదుటపడలేదు. తను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే గెలిచింది’ అంటూ ప్రముఖ గాయని ఆశా భోస్లే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రశంసలు కురిపించారు. తన క్షేమం గురించి ఆరా తీసిన ఆమెపై ట్విటర్‌ వేదికగా అభిమానం చాటుకున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి విశిష్ట అతిథులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌, సింగర్‌ ఆశా భోస్తే, కరణ్‌ జోహార్‌, అనుపమ్‌ ఖేర్‌, షాహిద్‌ కపూర్‌, బోనీ కపూర్‌, జితేంద్ర తదితర సెలబ్రిటీలు మోదీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక మాజీ నటి, ఎంపీ అయిన స్మృతి ఇరానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఓడించి సంచలన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమేథీ ఎంపీగా గెలుపొందిన ఆమె.. గురువారం రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 58 మంది కేబినెట్‌లో పిన్న వయస్కురాలైన మంత్రిగా చరిత్రకెక్కారు.

Advertisement
Advertisement