బ్రిడ్జిల్లో ఇది.. బాహుబలి | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిల్లో ఇది.. బాహుబలి

Published Thu, May 4 2017 1:52 AM

బ్రిడ్జిల్లో ఇది.. బాహుబలి

కశ్మీర్‌ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు ఉదంపూర్‌ – శ్రీనగర్‌–బారాముల్లా మార్గాన్ని వేస్తున్నారు. ఈ మార్గమధ్యంలోనే చీనాబ్‌ నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2019లో పూర్తయ్యే ఈ బ్రిడ్జి జమ్మూలోని బక్కల్‌–శ్రీనగర్‌లోని కత్రా–కౌరిలను కలుపుతుంది. బ్రిడ్జిల్లో బాహుబలిలాంటి దీని విశిష్టతలు చూద్దామా...     –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

ఇది పూర్తయ్యాక ఈ ఇంజనీరింగ్‌ అద్భుతం ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన రైల్వే బ్రిడ్జి అవుతుంది. చీనాబ్‌ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో రెండు కొండలను కలుపుతూ దీన్ని నిర్మిస్తున్నారు. 275 మీటర్ల ఎత్తులో ఉన్న షుయ్‌బాయ్‌ రైల్వే బ్రిడ్జి (చైనా)ని రెండో స్థానానికి నెడుతుంది మన చీనాబ్‌ బ్రిడ్జి. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు. అంటే ఈ బ్రిడ్జి ఈఫిల్‌ టవర్‌ కంటే మరో 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

- బ్రిడ్జి పొడవు 1.3 కిలోమీటర్లు . తనిఖీ నిమిత్తం రోప్‌ వే ఉంటుంది. రైల్వే లైన్‌తో పాటు పాదచారులు నడిచి వెళ్లేందుకు దారి, సైకిళ్లు వెళ్లడానికి మరోదారి ఉంటుంది. కశ్మీర్‌ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలను, గంటకు 260 కిలోమీటర్ల గాలివేగాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జిని డిజైన్‌ చేశారు.

- 24,000 టన్నులు. బ్రిడ్జి నిర్మాణంలో వాడుతున్న ఉక్కు. 63 ఎంఎం మందం కలిగిన పేలుళ్లను తట్టుకోగలిగే ప్రత్యేక ఉక్కును దీని నిర్మాణంలో వాడుతున్నారు. తీవ్రవాద దాడులు జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ బ్రిడ్జి నిర్మాణానికి పెడుతున్న ఖర్చు 1,100 కోట్లు.

- గంటకు 90కి.మీ. కంటే వేగంగా గాలులు వీస్తున్నట్లయితే సెన్సర్ల ద్వారా బ్రిడ్జికి ఇరువైపులా రెడ్‌సిగ్నల్‌ పడిపోతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బ్రిడ్జి పైనుంచి రైళ్ల రాకపోకలను అనుమతించరు. గాలివేగం తగ్గాక మళ్లీ ప్రయాణం మొదలవుతుంది.

Advertisement
Advertisement