షాజాపూర్: భోపాల్లో రైలు ప్రమాదం ఉగ్రవాద చర్యేనని మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడుకు పాల్పడిన నిందితుల కోసం ఏటీఎస్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయగా, మిగతావారి కోసం గాలిస్తున్నారు.
కాగా మంగళవారం ఉదయం షాజాపూర్ జిల్లా కలాపీపల్ వద్ద ప్యాసింజర్ రైల్లో జరిగిన పేలుడులో ఎనిమిదిమంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లా అండ్ ఆర్డర్ ఐజీ మక్రంద్ దివాకర్ కూడా ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పిపరియాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రయాణికులకు మెరుగైన చికిత్స నిమిత్తం భోపాల్ కు తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోనూ ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.