'9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు' | Sakshi
Sakshi News home page

'9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు'

Published Sun, Mar 27 2016 4:21 PM

'9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు' - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర గవర్నర్ పై కేంద్రంలోని నరేంద్ మోదీ సర్కారు బెదిరింపులకు పాల్పడిందని ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముట్టాయని, రూ.1000 కోట్లకు పైగా చేతులు మారాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానకి విశ్వప్రయత్నాలు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇక భవిష్యత్తు ఉండదని వారి రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని అభిప్రాయపడ్డారు.


ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు దారితీసిన పరిస్థితులపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు.  కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేయగా, ఈ విషయాన్ని గవర్నర్, రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు.

గత రెండు రోజులుగా బీజేపీ కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇలా జరిగిందని రావత్ ఆరోపించారు. 2014 ఫిబ్రవరిలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్రలు పన్నిందని, మెజారిటీ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంపై సీఎం హరీష్ రావత్ విచారం వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement