గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో బీజేపీ మహిళా విభాగం నాయకురాలు జమీలా ఖాన్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో జరిగింది. ఇందిరా సాహత్య నగర్లోని తన ఇంట్లో ఉండగా జమీలా బీ (50)పై కాల్పులు జరిగాయని గౌతమ్ నగర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి ముఖ్తార్ ఖురేషీ తెలిపారు. ఆమె భుజం నుంచి రక్తం కారుతుండగా ఆమె కొడుకు గమనించి.. వెంటనే ఆస్పత్రికి తరలించాడని, కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారని అన్నారు.
అయితే.. ఇంట్లో ఎవరికీ తుపాకి కాల్పులు వినిపించకపోవడం మాత్రం ఆశ్చర్యంగా ఉందన్నారు. దుండగులు బహుశా సైలెన్సర్లు అమర్చిన రివాల్వర్లతో వచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జమీలా ఖాన్ను చంపడానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.