ఆస్పత్రిలో ఘోరం.. యువకుడిని పీక్కుతిన్న చీమలు | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో ఘోరం.. యువకుడిని పీక్కుతిన్న చీమలు

Published Thu, May 11 2017 6:58 PM

ఆస్పత్రిలో ఘోరం.. యువకుడిని పీక్కుతిన్న చీమలు

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఆస్పత్రి బయట పడుకుని ఉన్న ఓ యువకుడిని చీమలు కుట్టి కుట్టి చంపేశాయి. ఈ ఘటన ప్రభుత్వ రంగంలోని ఎం.వై. ఆస్పత్రిలో జరిగింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ మృతదేహం ఆస్పత్రి ప్రధానద్వారం వద్ద గత రాత్రి పడి ఉందని సంయోగితగంజ్ పోలీసులు తెలిపారు. అతడు ఏ సమయానికి మరణించాడో, మరణానికి కారణం ఏంటో, అసలు అతడెవరో అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ అతడు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న పేషెంటా అన్న విషయం కూడా తెలియలేదు.

మృతుడి గురించి తమకు కూడా ఏమీ తెలియలేదని, ఆ విషయం పోలీసులు చూసుకుంటున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీఎస్ పాల్ తెలిపారు. ఇండోర్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం జూన్ నెలలో కూడా ఒక జిల్లా ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే జరిగింది. మార్చురీలో ఉన్న మూడు రోజుల పాప మృతదేహాన్ని చీమలు పీక్కుతిన్నాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆ చిన్నారి మరణించిందని అప్పట్లో ఆరోపణలు రావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. చివరకు అది పోస్టుమార్టంకు కూడా పనికిరాకుండా పోయింది.

Advertisement
Advertisement