ఇద్దరు విద్యార్థులు కలిసి బాలికను కిడ్నాప్ చేసి.. | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థులు కలిసి బాలికను కిడ్నాప్ చేసి..

Published Mon, Dec 26 2016 8:59 AM

ఇద్దరు విద్యార్థులు కలిసి బాలికను కిడ్నాప్ చేసి..

ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు టీనేజ్‌ విద్యార్థులు దారుణంగా హత్యచేశారు. దక్షిణ ముంబైలోని ఓ కాలేజ్‌లో చదువుతున్న వీరిని ఎట్టకేలకు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

వివరాలు.. నాగ్‌పాడ ప్రాంతంలోని డంకన్‌ రోడ్‌లో స్క్రాప్‌ డీలర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కూతురు ఫాతిమ ఇటీవల ఇంటివద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. బాలిక కనిపించకుండా పోయిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి కోటి రూపాయలు ఇస్తే పాపను వదిలేస్తామంటూ బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేయడం ద్వారా.. ఇంటి ఎదురుగా ఉండే విద్యార్థులే పాపను కిడ్నాప్‌ చేశారని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలిక తల్లిదండ్రుల వద్ద డబ్బు బాగా ఉందని భావించి, డబ్బుకోసమే కిడ్నాప్‌ చేసినట్లు వెల్లడించారు.

బాలికను ముందస్తు ప్లానింగ్‌తో విద్యార్థులు కిడ్నాప్‌ చేశారని.. కిడ్నాప్‌ చేసిన రోజే చంపేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పాప ఆడుకోవడానికి ఎదురింటికి వచ్చిన సమయంలో దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఇందుకోసం క్లోరోఫాం మత్తుమందును ముందుగానే సమకూర్చుకున్నారు. క్లోరోఫాం మోతాదు మించడంతో చిన్నారికి ముక్కులోంచి బ్లీడింగ్‌ అయిందని.. దాంతో మొబైల్‌ చార్జర్‌ వైర్‌తో ఉరిపెట్టి చంపామని విచారణలో నిందితులు అంగీకరించారు. నిందితుల సమాచారం మేరకు వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో పాలిథిన్‌ కవర్లలో దాచిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నాగ్‌పాడ ప్రాంతం ఉలిక్కిపడింది.

Advertisement
Advertisement