సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో మార్పులు చేయడంపై ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల్లో హిందువులు, దళితుల ఓట్లకు ఎర వేయడానికి బీజేపీ అవసరమనుకుంటే అంబేడ్కర్ రాముని భక్తుడని కూడా చెప్తుందని విమర్శించారు. ‘మా తాత భీంరావ్ రామ్జీ అంబేడ్కర్ అని సంతకం చేసేవాడని, అయితే ఎప్పుడు అలా పూర్తి పేరుతో వ్యవహరించేవారు కాద’ని ప్రకాశ్ తెలిపారు.
మహారాష్ట్రలో మిడిల్ నేమ్గా తండ్రి పేరును వాడుకోవడం సంప్రదాయమని అన్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అంబేడ్కర్ పేరులో మార్పులు తేవాల్సిన అవసరమేముందని బీజీపీని ప్రశ్నించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదేనని ఆరోపించారు. ఆయన పేరులో మార్పుకు సంబంధించి తమ కుటుంబాన్ని సంప్రదించకపోవడం విచారకరమన్నారు.