సీబీఐకి జే.డే హత్యకేసు దర్యాప్తు

5 Jan, 2016 17:58 IST|Sakshi
సీబీఐకి జే.డే హత్యకేసు దర్యాప్తు

ముంబయి: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు జే. డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసు దర్యాప్తును సీబీఐ మంళవారం చేపట్టింది. ఛోటారాజన్ పై ఉన్న అన్ని కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో ఈ కేసు కూడా సీబీఐకి బదిలీ అయింది. జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసు సహా ఛోటారాజన్ పై 70 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాన్ని బాంబే హైకోర్టు ఏర్పాటు చేసింది.

జ్యోతిర్మయ్ డే హత్య కేసులో పది మంది నిందితులపై ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీరిలో మహిళా జర్నలిస్టు జిగ్నా వోరా కూడా ఉన్నారు. 2011 జూన్ 11న సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఉదయం పూట రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు జ్యోతిర్మయి డేపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు.

ఈ కేసులో జిగ్నా వోరాను అదే సంవత్సరం నవంబర్ నెలలో అదుపులోకి తీసుకొని విచారించగా కీలక ఆధారాలు బయటపెట్టింది. వాటి ఆధారంగా పదిమందిపై అభియోగాలు నమోదుచేశారు. మాఫియా డాన్ చోటా రాజన్ కు వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్ రాశారనే కారణంతో జేడేను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. మిడ్ డే అనే పత్రికకు జే డే ఎడిటర్గా పనిచేశారు.

మరిన్ని వార్తలు