ఐటీ శాఖలో భారీ అవినీతి.. అధికారులు, సీఏల దందా | Sakshi
Sakshi News home page

ఐటీ శాఖలో భారీ అవినీతి.. అధికారులు, సీఏల దందా

Published Mon, Jan 12 2015 10:22 AM

ఐటీ శాఖలో భారీ అవినీతి.. అధికారులు, సీఏల దందా - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖలో భారీ అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. లంచం కేసులో ఐటీ శాఖ జాయింట్ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారితో పాటు ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, ఓ వ్యాపారవేత్త, మధ్యవర్తులు దొరికిపోయారు. సీబీఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఐటీ శాఖ విచారణ విభాగంలో పని చేసే అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలు చేతులు కలిపి.. కంపెనీలు, బడా ప్రముఖుల ఐటీ లావాదేవీలను పరిష్కారించడానికి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నట్టు సీబీఐ దృష్టికి వచ్చింది. సీబీఐ ఈ వ్యవహారంపై నిఘా వేసి.. శనివారం ముంబై, చెన్నైలో దాడులు నిర్వహించింది. చెన్నై ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ సలోంగ్ యాడెన్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు.

అరెస్టయిన వారిలో సీఏలు సంజయ్ బండారి, శ్రేయ బండారి, చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ తదితరులున్నారు. చెన్నై ఐటీ విచారణ విభాగం చీఫ్, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి 10 లక్షలు లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. గతంలో ఐటీ అధికారులు దాడులు చేసి బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పరిష్కారం కోసం ఐటీ విచారణ విభాగం చీఫ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కాగా సీబీఐ అధికారులు ఆయన పేరును రహస్యంగా ఉంచారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ పలు కంపెనీలపై  నిఘా వేసింది.

Advertisement
Advertisement