సీబీఐ డైరెక్టర్‌ను ఎందుకు నియమించలేదు? | Sakshi
Sakshi News home page

సీబీఐ డైరెక్టర్‌ను ఎందుకు నియమించలేదు?

Published Sat, Feb 2 2019 4:08 AM

Centre should immediately appoint regular CBI director - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను ఇంతవరకూ ఎందుకు నియమించలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంతకాలం సీబీఐకి పూర్తిస్థాయిలో డైరెక్టర్‌ను నియమించకపోవడంపై తాము సంతృప్తిగా లేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలుచేస్తూ ఎన్జీవో సంస్థ ‘కామన్‌ కాజ్‌’ దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.  కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

అసంపూర్తిగా సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐకు కొత్త చీఫ్‌ను ఎంపికచేసేందుకు ఏర్పాటైన అత్యున్నతస్థాయి మండలి సమావేశం శుక్రవారం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ ప్యానెల్‌ సమావేశానికి ప్రధానితోపాటు ప్యానెల్‌ సభ్యులైన సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే హాజరయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మధ్యప్రదేశ్‌ కేడర్‌ 1983 బ్యాచ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి రీనా మిత్రా సహా ఐదుగురి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. జనవరి 10 నుంచి సీబీఐ చీఫ్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది.

Advertisement
Advertisement