వైద్య సిబ్బందిపై దాడులు: కేంద్రం కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ

Published Mon, Apr 20 2020 12:21 PM

Centre Tough Note To States Lockdown Violation Attacks On Health Workers - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాపై పోరులో ముందుండి బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అదే విధంగా పట్టణాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైద్య సిబ్బందిపై దాడుల కేసులు, నిబంధనల ఉల్లంఘనలు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, వైద్య సిబ్బందిపై దాడులను కట్టడి చేసేందుకు.. లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆరు కీలక మంత్రిత్వ శాఖ సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటకలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. (లాక్‌డౌన్‌: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్‌!)

అదే విధంగా కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని.. వాటికి విరుద్ధంగా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్రం జారీ చేసిన నిబంధనలను అనుసరించి కొన్ని రంగాలకు మాత్రమే మినహాయింపునివ్వాలని స్పష్టం చేసింది. కేరళ, రాజస్తాన్‌ ఏప్రిల్‌ 20 నుంచి సవరించిన లాక్‌డౌన్‌ నిబంధనల ఆధారంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు మినహాయింపునివ్వగా.. ఢిల్లీ, పంజాబ్‌ తమ రాష్ట్రంలో నిబంధనలను సులభతరం చేయబోమని స్పష్టం చేశాయి. (ఆశా వర్కర్లపై దాడి.. కరోనా టెంట్లు ధ్వంసం)

Advertisement
Advertisement